బొగ్గు గనుల వేలంపై పరస్పర ఆరోపణలు
తెలంగాణలో సింగరేణిలో బొగ్గు గనుల వేలంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల యుధ్దం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య ట్వీట్ ల వార్ నడుస్తోంది. ముందు సీఎం రేవంత్రెడ్డికి పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా 2021లో బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, మొత్తం 4 బ్లాక్ లను సింగరేణికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకువాలని ట్వీట్ను రీట్వీట్ చేశారు కేటీఆర్. మరి అప్పుడు బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకించి, ఇప్పుడు సీఎం అయ్యాక వేలం పాట కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పంపడమేంటని రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్.
కేటీఆర్ ట్వీట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీట్వీట్ చేసి మరీ సమాధానం ఇచ్చారు. ముందు నుంచి తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణను, తెలంగాణ ప్రజల వాటాలను అమ్మడానికి కేంద్రంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడుగడుగునా వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేంద్రం సింగరేణి గనులను మొదటిసారి వేలం వేసిందని, రెండు ప్రైవేటు కంపెనీలు అరబిందో, అవంతికలకు అప్పగించిందని అరేవంత్ గుర్తు చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ ను నిలదీశారు సీఎం రేవంత్.
సింగరేణి గనులను వేలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలోనే వ్యతిరేకించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టేనని చెప్పిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్తోనే సురక్షితమని ట్విట్టర్ ద్వార ఘాటుగా సమాధానం ఇచ్చారు. మరి దీనిపై కేటీఆర్ ఎలా స్పందిస్తార్ననదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.