- గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్
- వచ్చేనెల బుగ్గపాడు మెటాటెక్స్టైల్స్ పార్క్ ప్రారంభం
- అన్ని జిల్లాల్లో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు మంత్రి తుమ్మల
కొహెడ పండ్ల మార్కెట్యార్డ్ నుంచి అంతర్జాతీయంగా ఎగుమతులు జరిపే విధంగా చర్యలు చేపట్టనున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మార్కెటింగ్, జౌళి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. ఖమ్మం మార్కెట్ యార్డు ఆధునికీకరణకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు తలమానికంగా నిలవనున్న కొహెడ పండ్ల మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అవసరమైన అభివృద్దికి చర్యలు తీసుకోనున్నామన్నారు.
సచివాలయంలోని తన ఛాంబర్లో మార్కెటింగ్, ఔళి, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుపై మంత్రి సమీక్షించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళి శాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన శాఖ సంచాలకులు అశోక్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి.లక్ష్మీబాయి పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్ యార్డుపై మంత్రి సమీక్ష : రైతాంగం సౌకర్యార్థం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థ గోదాములపై సౌరశక్తి ప్యానెల్స్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో తరచూ సంభవిస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
‘తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం – టెస్కో సంస్థ ద్వారా రాష్ట్రంలో ‘శానిటరీ నాప్ కిన్‘ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. బుగ్గపాడు మెగా టెక్స్టైల్ పార్కులో వచ్చే నెలలో పరిశ్రమల ప్రారంభోత్సవం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు.-రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దా్వారా వచ్చే ఉపాధి అవకాశాలపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, ఇదే అంశంపై అధికారులతో చర్చించామని , ఆహార శుద్ది ఏర్పాట్లుపై దృష్టి సారించామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు పేర్కొన్నారు.