Friday, May 30, 2025

కలెక్టర్ సంతకం ఫోర్జరీ రూ.1500 కోట్ల భూమిని కొట్టేసేందుకు ప్లాన్​

హైదరాబాద్‌ శివారులో రూ.1500 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కొట్టేసేందుకు ప్రణాళికలు రచించాడు ఓ కేటుగాడు. ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి లేని తహసీల్దార్‌ను సృష్టించి, తప్పుడు పత్రాలతో చెరువును చెరబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేశాడు. రిట్‌ పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి అధికార యంత్రాంగం అప్రమత్తతో ఘరానా కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పుడు పత్రాలను లోతుగా పరిశీలించిన రెవెన్యూ, పోలీసు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. హైదరాబాద్‌ శివారులోని గండిపేట్‌ మండలం నెక్నాంపూర్‌లో 30 ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్న అక్రమార్కులు, ఏకంగా చెరువునే చెరబట్టేందుకు యత్నించారు. నార్సింగి రెవెన్యూ, పోలీస్‌ అధికారుల పరిశీలనలో ఈ కబ్జా వ్యవహారం బయటపడింది. గ్రామంలోని సర్వే నంబర్‌ 44లో చెరువు, సర్వే నంబర్‌ 20లో ఎఫ్టీఎల్​లు ఉన్నాయని కొన్నిరోజుల క్రితం సర్వేలో గుర్తించారు. టోలీచౌకిలో నివాసముంటున్న ఇబ్రహీం 50 ఏళ్ల క్రితం నెక్నాంపూర్‌లో 30 ఎకరాలు కొన్నట్టు రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించారు.

ఇలా దొరికిపోయాడు
ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు వీలుగా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్‌ భారతి హొలికేరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉత్తర్వులు రూపొందించారు. గండిపేట్‌ మండలం తహసీల్దార్​ వేణుగోపాల్‌ అనే పేరుతో ప్రొసీడింగ్స్‌ సృష్టించారు. వీటి ఆధారంగా ధరణి పోర్టల్‌లో పేర్లు చేర్చాలంటూ ఇబ్రహీం దరఖాస్తు చేసుకోగా, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తిరస్కరించారు. ఇబ్రహీంపై కేసు నమోదు చేయాలని నార్సింగి పోలీసులకు మూడు నెలల క్రితం ఆదేశించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇబ్రహీం చెరువును చెరబట్టారని గుర్తించారు.
నెక్నాంపూర్‌లోని 30 ఎకరాలను హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇబ్రహీం ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి కూడా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్‌ భారతి హొలికేరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి, తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలతో కొద్దినెలల క్రితం ఇబ్రహీం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇబ్రహీం దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌పై హైకోర్టు విచారణ నిర్వహించి దరఖాస్తుదారుడి వినతిని పరిశీలించండి అంటూ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు అప్పటి కలెక్టర్‌ భారతి హోలికేరీ సంతకాలు చేసిన ఫైళ్లను నవంబరు, 2023లో పరిశీలించగా ఇబ్రహీం పేర్కొన్న సర్వే నంబర్లు, భూముల వివరాలపై ఆమె ఎలాంటి ప్రొసీడింగ్స్‌ను జారీ చేయలేదని గుర్తించారు. ఆన్‌లైన్‌ రికార్డులను కూడా చూడగా ఉత్తర్వులు కనిపించలేదు.

తహసీల్దార్​ను సృష్టించి..!
ఇబ్రహీం 30 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు వేణుగోపాల్‌ పేరుతో కొత్త తహసీల్దార్‌ను సృష్టించాడు. ఆయన పేరుతో నాలా కన్వర్షన్‌ ఉత్తర్వులు, ఈ-పాస్‌ పుస్తకాలను నవంబరు 2023లో రంగారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించారు. అనంతరం అసలైన పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు కావాలంటూ ఈ ఏడాది మార్చిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఇబ్రహీం సమర్పించిన ఫోర్జరీ పత్రాల్లో తహసీల్దార్‌ వేణుగోపాల్‌ జారీ చేసిన ఉత్తర్వులున్నాయి. 2024లో వేణుగోపాల్‌ అనే తహసీల్దార్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ అయ్యిందని, కానీ ఆ పేరుతో ఎవరూ లేరని అప్పటి నుంచి తానే డిపేట్ మండలం తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఫోర్జరీ పత్రాల సృష్టి వెనుక నిందితుడు ఇబ్రహీంతో పాటు మరెవరైనా ఉన్నారా? అప్పట్లో ఎవరైనా రెవెన్యూ సిబ్బంది సహకరించారా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com