కేసీఆర్ బర్తరఫ్కు న్యాయపరంగా దృష్టి పెడతాం
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకుంటాం
గజ్వేల్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులకు నిధులు
గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సిఎం రేవంత్రెడ్డి
సోమవారం తన నివాసంలో గజ్వేల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి
గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి హాజరు కానీ గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో గత నాలుగు రోజుల కిందట ‘పోరుబాట పాదయాత్ర – ఛలో రాజ్భవన్’ పేరిట సిద్ధిపేట కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం హైదరాబాద్కు చేరుకుంది. రాజ్భవన్కు వెళ్లే ముందు సిఎం రేవంత్రెడ్డి నివాసంలో సిఎం రేవంత్రెడ్డిని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కలిశారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ…కేసీఆర్ బర్తరఫ్ కోసం న్యాయపరంగా దృష్టి పెడతామన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల భూ నిర్వాసితుల సమస్యలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన సిఎం రేవంత్రెడ్డి నెల రోజుల్లో నిర్వాసితులతో సమావేశం ఏర్పాటు చర్చిద్దామని, వారిని అన్ని రకాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, గజ్వేల్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులకు నిధులను మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా నర్సారెడ్డి ఆరోగ్యం బాగా లేనప్పటికీ పాదయాత్ర చేపట్టడం పట్ల కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపిందన్నారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివొచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన కరచాలనం, అభివాదం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేత ఆంక్షారెడ్డి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని, గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి అదనంగా నిధులు మంజూరు చేయాలని, భూ నిర్వాసితులను ఆదుకోవాలని సిఎం రేవంత్కు ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు గంగుమల్ల ఎలక్షన్రెడ్డి, మడుపు భూంరెడ్డి, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ నిమ్మ రంగారెడ్డి, నాయకులు చెరుకు లక్ష్మారెడ్డి, మోహన్, సలీం, ప్రభుదాస్గౌడ్, సాజిద్ బేగ్, రాములు గౌడ్, విరుపాకల శ్రీనివాస్రెడ్డి, లింగారావు, కేసిరెడ్డి రవీందర్రెడ్డి, సందీప్రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, కిష్టాగౌడ్, వెంకట్ నర్సింహరెడ్డి, అట్ల భాస్కర్రెడ్డి, మహేందర్రెడ్డి, శివారెడ్డి, పల్లెర్ల రవీందర్ గుప్త, సుఖేందర్రెడ్డి, సుల్తాన్, తిరుమల్రెడ్డి, మాధవరావు, రమేష్గౌడ్, సారిక శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.