‘తెలంగాణలో పేదలే లేరు.. రేషన్ కార్డులు ఎందుకు?’.. మండలి ఛైర్మన్ గుత్తా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ప్రభుత్వం పలు కీలక బిల్లులు ఉభయ సభల ముందు ఉంచుతోంది. ఇక త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మండలి ఛైర్మన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. ‘తెలంగాణలో పేదలు లేరు.. రేషన్ కార్డులు అవసరం లేదు’ అని గుత్తా అన్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ తర్వాత రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 18 లక్షల మందిలో 10 లక్షల మంది దరఖాస్తుదారులు జనవరిలో కార్డులు అందుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
క్లెయిమ్ ఏంటి..?
తెలంగాణలో పేదలు లేరు అని మండలి ఛైర్మన్ అన్నట్లు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలో పేదలు లేరు కాబట్టే రేషన్ కార్డులు పంపిణీ చేయట్లేదని ఈ వీడియోక కొందరు పోస్టులు పెడుతున్నారు. ‘తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.70 లక్షలు ఉంటే పేదరికం ఎక్కడుంది.. పేదలు ఎవరున్నారని రేషన్ కార్డులు ఇస్తారు.’ అని పోస్టులు పెడుతున్నారు.
నిజ నిర్ధరణ జరిగిందిలా..
ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సహా మండలి సభ్యులు రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు సంధించారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం 2.81 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారని, అదనంగా 40 లక్షల మంది లబ్ధిదారులను చేర్చాలని ప్రభుత్వం చెబుతోంది. అంటే అప్పుడు లబ్ధిదారుల సంఖ్య 3.2 కోట్లకు చేరకుంటుంది. తెలంగాణ మెుత్తం జనభాలో ఇది 80 శాతం. రాష్ట్రంలో 80 శాతం మంది పేదలు ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు. సభ్యుడి ప్రశ్నపై స్పందించిన ఛైర్మన్ గుత్తా.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కొత్త రేషన్ కార్డ్ మార్గదర్శకాల కోసం నేను నా సూచనలను పంపాను. దేశం యొక్క BPL శాతం ఎంత? 27 శాతం అని విన్నాను.
గణాంకాల ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3.7 లక్షలు. అలా అయితే తెలంగాణలో పేదరికం ఎక్కడుంది? అన్నం అంతా ఎక్కడికి పోతోంది? కాకినాడ పోర్టుకు వెళుతుందా? (వ్యంగ్య వ్యాఖ్య)? BPL డేటాను సరిపోల్చి నిజమైన అర్హులకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేయండి. రేషన్ కార్డుల నిజమైన లబ్ధిదారులను గుర్తించేందుకు సరైన మార్గదర్శకాలను రూపొందించండి.’ అని ప్రభుత్వానికి చేసిన సూచనలో భాగంగా ఆయన కామెంట్స్ చేశారు. ఛైర్మన్ గుత్తా సూచనలపై స్పందించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ‘రేషన్ కార్డులను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయిస్తే.. మేము దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. ఛైర్మన్ గుత్తా స్పందిస్తూ.. ‘లేదు, లేదు, నేను రేషన్ కార్డులను తగ్గించమని సూచించడం లేదు. మన దగ్గర ఖచ్చితమైన గణాంకాలు ఉండాలి. ప్రజలకు బాధ్యత వహించాలి.’ అని సూచించారు.