టీఎస్, న్యూస్:తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీని మూడో సారి ప్రధానిగా చేద్దామా..? 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామా..? అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.
ప్రస్తుతం దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నామ స్మరణే వస్తుందని, మజ్లీస్ అజెండా తోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తాయని అమిత్ షా ఫైర్ అయ్యారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లీస్కు భయపడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్.. మూడూ వారసత్వ పార్టీలే అని, అవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయని, ఓబీసీల గురించి ఆ మూడు పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా..? అని ప్రశ్నించారు. కేవలం వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఈ పార్టీలు ఆలోచిస్తాయని షా మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలన అంతా కుంభకోణాల మయం,తెలంగాణ ప్రజలు బీజేపీకి 12 ఎంపీ సీట్లు తగ్గకుండా ఇవ్వాలని కేంద్ర మంత్రి అమిత్ షా కోరారు. మోదీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ. 6 వేల చొప్పున వేస్తూ.. అండగా ఉంటోందని, వచ్చే ఐదేళ్లలో దేశమంతటా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీరు ఇస్తామని, ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచి నీటి నల్లా కనెక్షన్లు ఇచ్చామని, పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ. 1.17 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని, మోదీ పాలనలో ఇప్పటికే రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లు వచ్చాయని, బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు అని అమిత్ షా వివరించారు.