కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆగ్రహం
‘జయ జయహే తెలంగాణ’ గీతంపై బిఆర్ఎస్ నాయకులు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తూ ఆయన వీడియో విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమ పేరుట అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి కనీసం జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని ఆయన విమర్శించారు. నేడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే కెసిఆర్, కెటిఆర్లు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారని ఆయన దుయ్యబట్టారు.
తెలంగాణ గుండె తడి తెలిసిన అణగారిన వర్గానికి చెందిన అందెశ్రీ రాసిన గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే బిఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ గీతాన్ని ఎంఎం కీరవాణి కంపోజ్ చేస్తే అతన్ని ఆంధ్ర మూలాలున్న వ్యక్తిగా కెసిఆర్, కెటిఆర్లు విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర కోడలు సమంతను తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా, ఆంధ్ర అమ్మాయి మంచులక్ష్మిని తెలంగాణ స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రానికి సంబంధం లేని నటి రకుల్ ప్రీత్ సింగ్ను బాలిక విద్యకు బ్రాండ్ అంబాసిడర్ గా కెటిఆర్ నియమించినప్పుడు మీకు తెలంగాణ సోయి గుర్తుకు రాలేదా? అని ఆయన నిలదీశారు. యాదాద్రి ఆర్కిటెక్ట్గా ఆంధ్ర సాయిని నియమించినప్పుడు మీ పౌరుషం ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు.