- బిఆర్ఎస్ కుటుంబ రాజకీయాలను గురించి
- మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది
- సిఎం టూర్ అంతా పారదర్శకంగా జరుగుతుంది
- కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి
బిఆర్ఎస్ కుటుంబ రాజకీయాలను గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వచ్చాక నిరుద్యోగులకు ఏమి చేయని కెసిఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపిలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సిఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే దానిని కూడా వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సిఎం టూర్ అంతా పారదర్శకంగా జరుగుతుందని, ముఖ్యమంత్రి బృందంలో ఉన్న అధికారులు గతంలో బిఆర్ఎస్ హయంలో కెటిఆర్ వెంట విదేశాలకు వెళ్లిన వారేనన్నారు. కాంగ్రెస్ను ఎలా బద్నాం చేయాలన్న ఆలోచనతోనే తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బిఆర్ఎస్ ముందుకు వెళ్తుందని ఆ పార్టీ నేతలు ప్రజలను మాయమాటలు చెప్పి తప్పదోవ పట్టిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కెటిఆర్ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు? ఎన్ని కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో బిఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపితో సెట్ చేసుకొని వెళితే బెటర్..
గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఫాంహౌస్ దాటిపోలేదని సింగపూర్, చైనాకు మాత్రం హాలీడేస్ కోసం వెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాత్రం పదవిలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు రెండుసార్లు విదేశాల్లో పర్యటించారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లిన తొలి ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. తక్కువ వడ్డీలకు అప్పులిచ్చే ప్రపంచ బ్యాంకు వంటి వనరులు ఉన్నా వాటిని వాడుకోకుండా రాష్ట్రాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందని ఆయన ఆరోపించారు. గంజాయి, చీప్ లిక్కర్, డ్రగ్స్ మినహా అన్ని వ్యాపారులకు అనుమతులు ఇస్తామని, కెటిఆర్ బావమరిది, కవిత భర్త అయినా పార్టీలు, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటే ఆహ్వానిస్తామన్నారు.
ఉద్యోగాలు ఇవ్వడం, సంపద సృష్టించడమే తమ లక్ష్యం అన్నారు. బిఆర్ఎస్లో కొంతమంది భజన బ్యాచ్ ఉందని, సోషల్ మీడియాలో ఏదైనా పెట్టకపోతే వారికి బ్రతుకుదెరువు లేదని ఘాటు విమర్శలు చేశారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కెసిఆర్ వద్ద మార్కులు కొట్టేసేందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ నేతలు వారం రోజులుగా ఢిల్లీకి వచ్చి బిజెపి పెద్దలతో సంప్రదింపులు చేసుకొని సెట్ అయితే బెటర్ అన్నారు. బెయిల్ కోసం వారం రోజులుగా ఢిల్లీ ఎవరూ ఉండరని బిజెపికి, బిఆర్ఎస్కు మధ్య ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. రైతురుణమాఫీ కావడం లేదన్న కిషన్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా అని ఆయన విమర్శించారు.