5-లక్షల పైచిలుకు ప్రజలతో పబ్లిక్ మీటింగ్
రుణమాఫీ పూర్తి చేసి రైతుల చెంతకు వెళ్లనున్న ప్రభుత్వం
20వ తేదీ ఉదయం హైదరాబాద్కు సోనియా
సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ
కార్యక్రమం తర్వాత ఢిల్లీకి సోనియాగాంధీ
అదే రోజు సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్
అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్లో వరంగల్ సభకు….
రైతు రుణమాఫీ పూర్తి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో కృతజ్ఞత సభకు సిద్ధమవుతోంది. రాజీవ్ గాంధీ జయంతి రోజైన ఈనెల 20వ తేదీన వరంగల్లో ఈ కృతజ్ఞత సభను నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ఐదు లక్షల నుంచి 10 లక్షల మంది హాజరయ్యేలా కాంగ్రెస్ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 2022 మే 6వ తేదీన వరంగల్ వేదికగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.
అందులో భాగంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడడంతో దానిని ఆచరణలో పెట్టారు. ఆగష్టు 15వ తేదీతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తయింది. దీంతో వరంగల్ లో నిర్వహించే కృతజ్ఞత సభకు రావాలని సిఎం రేవంత్ రాహుల్ గాంధీని కోరడంతో ఆయన అంగీకరించారు.
20వ తేదీ కాకపోతే 24వ తేదీ ఈ రెండు కార్యక్రమాలు
సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అదే రోజు ఉదయం ఏఐసిసి అగ్రనేత సోనియాగాంధీ ఆవిష్కరించనున్నారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నేరుగా సోనియాగాంధీ ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ వెళ్తారు.
అక్కడ జరిగే సభలో రైతులను, ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఒకవేళ 20వ తేదీన జనసమీకరణతో పాటు ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురయ్యే పక్షంలో ఈనెల 24వ తేదీన ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది.