- బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బిజెపి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి…
- ఐదేళ్లు సిఎం రేవంత్ రెడ్డే..
- కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
ఆర్ఎస్కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పిన కిషన్ రెడ్డి మాటలను స్వాగతిస్తున్నామని, అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఐదు నెలల కాంగ్రెస్ పాలన బాగుందని, రాష్ట్రంలో మంచి పాలన ఉన్నందునే వారంతా తమపార్టీలో చేరుతున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే జరిగితే కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టన్నారు. ఐదేళ్లు సిఎం రేవంత్ రెడ్డి అని, కాంగ్రెస్ ప్రభుత్వం సేఫ్ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బిజెపి నేతలు ప్రొఫెసర్లు అని, తెలంగాణలో బిజెపి ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేదన్నారు. బిజెపి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రాదని తేలిపోయిందన్నారు.
అందుకే బిజెపి వాళ్లు రోజుకో భాష, రోజుకో వేషం మారుస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి చాలా గొప్పవారని, అటల్ బీహార్ వాజ్పాయ్ దారిలో నడుస్తున్నట్టున్నారన్నారు. మంచి పని చేస్తే ప్రతిపక్షంలో ఉన్నా ప్రశంసించే గుణం వాజ్పాయ్దని ఆయన అన్నారు. నిండు పార్లమెంట్లో ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చారన్నారు. బిజెపిలో ఉన్న ఐదుగురిలో కూడా కొందరు బయటకు వస్తారని జగ్గారెడ్డి ఆరోపించారు. డైరెక్ట్గా బిఆర్ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు వస్తున్నట్టు కిషన్రెడ్డి చెప్పారన్నారు.
కిషన్రెడ్డి వ్యాఖ్యలు తమకు సంతోషాన్ని ఇచ్చాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు. వరి గురించి ఆయనకు అవగాహన లేదని, అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుందని జగ్గారెడ్డి సలహా ఇచ్చారు. వరికి మద్ధతు ధర ఫిక్స్ చేసిందే కేంద్రం అని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడి రైతులను కన్ఫ్యూజ్ చేయొద్దన్నారు. కెటిఆర్ ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని, కెటిఆర్ మాట్లాడినా, హరీష్ మాట్లాడినా రేవంత్ మీద బురద జల్లడమే వారి పని ఆయన ఆరోపించారు. తెలంగాణలో హత్యా రాజకీయాలు లేవు, ప్రభుత్వం దానిని ప్రోత్సహించదని ఆయన తెలిపారు.