రాష్ట్రంలో ఇప్పటికే పలు వివాదాల్లో సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. కమ్యూనిస్టులను సమన్వయంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఫైర్ అయ్యారు. సీపీఐ మద్దతుతో గెలిచామన్న విషయాన్ని మర్చిపోవద్దని చురకలు అంటించారు. దేశవ్యాప్త పరిణామాలను చూస్తూ కూడా మారరా? అంటూ ప్రశ్నించారు. కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదని, తమ కార్యకర్తలు, నేతలకు ఎక్కడా ప్రాధాన్యం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చేసిన పనులు చెప్పుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందుతోందని, రుణమాఫీ రూ.2 లక్షల విషయంలో కొంత వైఫల్యం చెందారన్నారు. ప్రభుత్వంలో ఎవరూ ఫోన్ కాల్స్ తీయడం లేదని, ఇలా అయితే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయని ఆరోపించారు.