- బీజేపీపై విషం కక్కడమే వారి ఆ పార్టీల ఎజెండా
- కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి
చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానేలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.
పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో గ్యారెంటీల హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. అటు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు.ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వరుసగా మూడోసారి మోదీ అధికారంలోకి రావడమే కాదు, 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా, మరో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ రోజురోజుకు విస్తరిస్తూ ఉంటే, కాంగ్రెస్ కుచించుకుపోతుంది. నేడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. వివిధ ఎజెండాలతో సమాజంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.