అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించం
ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని, తెలంగాణను పాలించే శక్తిని కొడంగల్ ప్రజలే తనకు ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొందరికి వాళ్ల కుర్చీ పోయిందన్న బాధ ఉందని, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్నారు. తానేం చేస్తానో… ఏం చేయనో… మీకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదని చెప్పారు. కొడంగల్ నివాసంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్” జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానన్నారు. కొడంగల్ ను కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. అమిత్ షా పార్లమెంట్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను అవమానించేలా మాట్లాడారు. మహాత్మా గాంధీని చంపినవారిని ప్రోత్సహించేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగింది.
ప్రజలు కనిపించని దేవుడిగా అంబేడ్కర్ ను కొలుస్తున్నారు ప్రతీ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టుకుని ఆయనను ఆరాధిస్తున్నారు. అలాంటి మహనీయుడి పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతీ చోట సమావేశాలు నిర్వహించి అంబేడ్కర్ స్ఫూర్తిని చాటుతున్నాం. ముఖ్యమంత్రిగా నాకు ఈ బలం, శక్తి మీరిచ్చింది. అసెంబ్లీకి వొస్తే వినాల్సి వొస్తుందని, వింటే పడాల్సి వొస్తుందని కెసిఆర్ రావడంలేదు. వొచ్చినవాళ్లకు ఓనమాలు కూడా రావు…. చెప్పినా నేర్చుకోరు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్ కు పోయిందని వాళ్లకు దుఃఖం. అందుకే కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్ ను కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్ కే ఉంటుంది. పదేళ్లలో కొడంగల్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని… భూసేకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. పరిశ్రమలు మన దగ్గర లేకపోవడం వల్లే మన ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారు. ఇక్కడకు పరిశ్రమలు వొస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా తాపత్రయం. వచ్చే ఐదేళ్లలో మరో పదివేల కోట్లతో కొడంగల్ ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది నా కోరిక. మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు… నాయకుడిగా మీ ప్రేమ నాకు చాలు. డీజిల్ కు పైసలు వసూలు చేసినవాళ్లు ఇవాళ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే అందరం మునుగిపోతాం. కొడంగల్ భూముల విలువ ఎకరానికి కోటి పెరగాలంటే ఇక్కడ అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి అడ్డుపడి ఆపాలని చూసే ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ వ్యాఖ్యానించారు.