- కేసీఆర్ హయాంలో 8 వేల హత్యలు.. లక్ష చోరీలు
- రేవంత్ మంచోడు కాబట్టే..మీరు మాట్లాడుతున్నారు
- అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు
అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఆనాడు విపక్ష సభ్యులను కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అంతేగాకుండా విపక్షమే లేకుండా చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో ఉన్నారని లేదంటే..
నిన్నటి దాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అనేలా పరిస్థితి ఉండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 8 వేల హత్యలు.. లక్ష దొంగతనాలు జరిగాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అహంకారంతో సాగిందని.. తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అని అన్నారు.
పోలీస్ అధికారులు కూడా బీఆర్ఎస్ అధికార దాహానికి బలయ్యారని.. బీఆర్ఎస్ పెద్దలు చెప్పిన అందరి ఫోన్లు ట్యాప్ చేసి ఇప్పుడు ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ చేయించిన పాపాలతో పోలీసులు విదేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి వొచ్చిందన్నారు. బీఆర్ఎస్ పోలీసు వ్యవస్థను దారుణంగా వాడుకుందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపైనా తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ పీసీసీ పదవిని రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటి రెడ్డి అన్నాడని కెటిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డ రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ప్రతిపక్షం లేకుండా చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మాకు నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. మీకు నాయకుడే లేడు.. సభకు రావడమే మానేశారని తెలిపారు. అహంకారంతో సాగింది బీఆర్ఎస్ పాలన.. మేము ఆరుగురం ఉన్నప్పుడు మా గొంతు నొక్కారు. సభ సొంతమా అని అడిగారు. ఇప్పుడు నేను అడుగుతున్న.. సభ మీ సొంతమా మరి.. వొచ్చినప్పటి నుండి ఒకటే గొడవ.. గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. ఆ టైమ్ ప్రజల కోసం కేటాయిస్తే చాలు అని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.