Monday, June 9, 2025

దైవ సాక్షిగా.. నిజమే చెబుతా కాళేశ్వరం విచారణ ప్రారంభం

కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు విచారణ జరిగింది. వాస్తవాలు చెబుతానని దైవసాక్షిగా మాజీ మంత్రి ప్రమాణం చేశారు. హరీష్ రావును ఓపెన్ కోర్టులో పీసీ గోష్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టు రీ డిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడి హట్టి వద్ద చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసి ఎందుకు మార్చాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. దానికి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసి పనులను కూడా ప్రారంభించిందని తెలిపారు. అయితే పనులను ప్రారంభించిన సమయంలో ఆనాడు మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పిందని, ఆ సమయంలో మహారాష్ట్రలోనూ, తెలంగాణలోనూ, సెంట్రల్‌లో కూడా కాంగ్రెస్ సర్కారే ఉందన్నారు. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. దాంతో తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్రానికి నీళ్లు రావాడం కోసం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మహారాష్ట్ర అభ్యంతరాలు చెప్పడంతో ముందుకు వెళ్లే సాధ్యం కాని పరిస్థితుల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత ప్రాజెక్ట్‌పై నిర్ణయం కోసం కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషన్‌కు తెలిపారు మాజీ మంత్రి. ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చిందని, అలాగే నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ కూడా నివేదిక ఇచ్చిందని, అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని మార్చి తుమ్మడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలని… మూడు బ్యారేజీలు నిర్మించాలని టెక్నికల్ కమిటీ నివేదిక మేరకే కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించినట్లు చెప్పుకొచ్చారు. అయితే స్థల మార్పు, రీడిజైన్ అనేది కొత్తగా చేపట్టిందేమీ కాదని, దేశంలో అనేక ప్రాంతాల్లో మొదటగా నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్‌లను రిడిజైన్ చేసి స్థలాలు మార్చిన సందర్భాలు ఉన్నాయని మాజీ మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

==
కమిషన్ వేసిన ప్రశ్నలు ఇవే…
==

కమిషన్: జీవో 115 ప్రకారం వేసిన మంత్రుల సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు? మంత్రుల సబ్ కమిటీ ఏ అంశాలపై స్టడీ చేసింది?

హరీష్‌రావు: రైతులకు ఎక్కువ సంఖ్యలో నీళ్లు అందించాలనే లక్ష్యంతో స్టడీ కోసం అప్పటి ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్,హరీష్ రావు ఉన్నారు. సిడబ్ల్యుసి, రిటైర్డ్ ఇంజనీర్ల సూచనల మేరకు మేడిగడ్డ నిర్మాణం జరిగింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చాం. 16 లక్షల కంటే ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలంటే… రిజర్వాయర్ల సంఖ్య పెంచాలని సీడబ్ల్యూసీ చెప్పింది. సీడబ్ల్యుూసీ సూచనల మేరకే బ్యారేజీలు, రిజర్వాయర్ల సంఖ్య పెంచాం. మేడిగడ్డ నిర్మాణం ఒక్కరి నిర్ణయం కాదు… మేడిగడ్డ నిర్మాణానికి ముందు మంత్రులు, అధికారులు అనేక సార్లు భేటీ అయ్యారు. వ్యాప్కోస్ నివేదికల ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాం. మేడిగడ్డ నిర్మించాలని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా రిపోర్టులు ఇచ్చారు.

కమిషన్: అన్నారం సుందిళ్ళ లొకేషన్ మార్చడంపై ఏమైనా చర్యలు తీసుకున్నారా ?

హరీష్‌రావు: లొకేషన్ మార్పు అంశం పూర్తిగా టెక్నికల్.టెక్నికల్ రిపోర్టులు ఆధారంగా లొకేషన్స్ మారాయి. బ్యారేజీలు, ప్రాజెక్టుల లొకేషన్స్ మారడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున సాగర్, కాంతనపల్లి లాంటి ప్రాజెక్టులు లొకేషన్‌లు మారాయి.

కమిషన్: ప్రాజెక్టుల లొకేషన్‌లు మార్చే అధికారం హై పవర్ కమిటీకి అధికారం ఉందా?

హరీష్‌రావు: అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది .

కమిషన్: కాలేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు కారణం ఏంటి?

హరీష్‌రావు: లోన్స్ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.

కమిషన్: కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్స్ రీపేమెంట్స్ ఎలా చేయాలనుకున్నారు?

హరీష్‌రావు: నీళ్లను అమ్మి లోన్లను రీ పేమెంట్ చేయాలి అనుకున్నాము.

కమిషన్: కార్పొరేషన్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయిందా? అయితే ఇంత చేశారు?

హరీష్‌రావు: కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు డిలే అయింది. అప్పటికే మెదక్‌లో కోకాకోలా కంపెనీ లాంటి సంస్థలు వచ్చాయి.

కమిషన్: నిర్మాణ సంస్థలకు సైట్ ఆలస్యంగా ఎందుకు ఇచ్చారు?

హరీష్‌రావు: సాధారణంగా అప్పటి పరిస్థితులు ఆధారంగా సైట్స్ కొంత డిలే అవుతాయి.

కమిషన్: మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు డైరెక్ట్ గా నీళ్లు ఇవ్వొచ్చు ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందా?.

హరీష్‌రావు: డైరెక్ట్‌గా నీళ్లు ఇవ్వడానికి సాధ్యం కాదని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది.

కమిషన్: బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేశారా?

హరీష్ రావు: టెక్నికల్ అంశాలు మా దృష్టిలో ఉండవు.

కమిషన్: కాళేశ్వరం ద్వారా ఎన్ని నీళ్లలో స్టోరేజీ చేశారు ?

హరీష్ రావు: రిజర్వాయర్ల ద్వారా 141 టీఎంసీల నీళ్లను స్టోరేజ్ చేశాం.

కమిషన్: బ్యారేజీలలో ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నీళ్లను స్టోర్ చేశారా ?

హరీష్ రావు: టెక్నికల్ అంశాలు అధికారులు మాత్రమే చూసుకుంటారు.

కమిషన్: బ్యారేజీలలో నీళ్లను నింపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?

హరీష్ రావు: బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించలేదు.

కాలేశ్వరం కార్పొరేషన్, డిజైన్ల మార్పు, బ్యారేజీలలో నీళ్లను నింపడం, డిజైన్లు తయారీపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది. మహారాష్ట్ర ఒప్పుకోలేదు కాబట్టే మేడిగడ్డ నిర్మాణం జరిగిందని, కమిషన్ ముందు కాలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూపించి మరీ వివరించారు మాజీ మంత్రి. కమిషన్ ముందు జీవోలు, డాక్యుమెంట్ ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానాలు చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com