జమ్ము కశ్మీర్లో చిక్కుకున్న 52 మంది తమిళనాడు విద్యార్థులు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేయగా.. ఆ దేశం సైతం ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ.. మెరుపు దాడులకు పాల్పడుతోంది. మరోవైపు భారత్ వీటిని గట్టిగా తిప్పికొడుతూనే.. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో జమ్ము కశ్మీర్లో చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు, విజ్ఞాన యాత్ర కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయం గుర్తించిన సీఎం ఎంకే స్టాలిన్ వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్లోని పలు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే ఆ రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. ఈ సమయంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. మొత్తంగా 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. భారత్ సైతం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. ముఖ్యంగా దాయాది దేశంపై దౌత్య పరంగా చర్యలు తీసుకుంటూనే.. మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. దీంతో ఆ దేశం సైతం.. భారత్పై ప్రతిదాడులకు పాల్పడుతోంది.