ఏఐసీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. 9 రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్లను మార్చేసింది. ఈ మార్పుల వెనక రాహుల్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఈ మార్పులతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిమాణం జరిగింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారా ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జ్ వచ్చారు. అయితే.. ఈసారి అలాంటి ఇలాంటి లీడర్ కాదు.. ఏకంగా రాహుల్ గాంధీ టీంలో ఉన్న కీలక నాయకురాలినే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్గా నియమించారు. మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర ఇంచార్జీగా ప్రకటించారు. ఈ మేరకు అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దీపాదాస్ మున్షిని ఎందుకు మార్చారనే ప్రచారం కాంగ్రెస్లో మొదలైంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా ఉన్న దీపా దాస్ మున్షీ స్థానంలో కొత్త ఇంఛార్జీని నియమించింది అధిష్ఠానం. రాహుల్ గాంధీ టీంలో కీలక నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంఛార్జ్గా మీనాక్షి నటరాజన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి నటరాజన్.. కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నుంచి పని చేస్తూ వచ్చారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ వింగ్లో పలు పదవుల్లో పని చేసిన మీనాక్షి నటరాజన్.. ఏఐసీసీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మంద్సౌర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి.. ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. కానీ.. ఆ తర్వాత రెండు ఎన్నికల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే.. ఏఐసీసీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్.. రాహుల్ గాంధీ టీమ్లో కీలక సభ్యురాలిగా గుర్తింపు పొందటం గమనార్హం.
దీపా ఏం చేసింది..?
అయితే.. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మారనుందంటూ గత కొన్నిరోజులుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు ఇంఛార్జిగా ఉన్న దీప్ దాస్ మున్షీ కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలు చూసుకుంటున్నారు. దీంతో ఆమె తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతుందన్న ఆరోపణలతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా రావటంతో అధిష్ఠానం కీలక నిర్ణయమే తీసుకుంది. దీపా దాస్ మున్షీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను కలవట్లేదని, కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారంటూ కొన్ని ఫిర్యాదులు అధిష్ఠానానికి చేరాయి. దీపా దాస్ మున్షీ తీరుతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆమెను మార్చాలంటూ హైకమాండ్ దృష్టికి రాష్ట్ర నేతలు తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం.. దీపా దాస్ మున్షీని కేరళకు పరిమితం చేసి, కొత్త నేతకు అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాలిని ఇంఛార్జ్గా నియమించటంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది.
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇంఛార్జ్ను నియమించటమే కాకుండా.. హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాల కాంగ్రెస్కు కూడా కొత్త ఇంఛార్జులను అధిష్ఠానం ప్రకటించింది. మరోవైపు.. పంజాబ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలకు కొత్త జనరల్ సెక్రటరీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.