దేశ రాజధాని అయిన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలయింది. తొలి రెండు గంటల్లో 10 శాతం ఓటింగ్ నమోదయింది. చలి కారణంగా ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ బూత్ లకు వస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కీలక సూచన చేశారు. ‘ఢిల్లీలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పాల్గొనాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులకు అభినందనలు అని ట్వీట్ చేశారు.