భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగడంతో దేశ రాజధాని ఢిల్లీ హై అలెర్ట్గా ఉన్నది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దీని కోసం ఎయిర్ సైరన్స్ను పరీక్షించింది. శుక్రవారం ఢిల్లీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా వైమానిక దాడి సైరన్లు మోగించారు. ఈ డ్రిల్కు ముందు ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఐటీవోలోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్బ్యూడీ) ప్రధాన కార్యాలయంపై ఏర్పాటు చేసిన వైమానిక దాడి సైరన్ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని సూచించింది.
కాగా, శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటల నుంచి ఎయిర్ సైరన్ టెస్ట్ నిర్వహించారు. రెండు సార్లు చొప్పన 15 నుంచి 20 నిమిషాల పాటు సైరన్ మోగించారు. ఢిల్లీలోని ఎత్తైన భవనాలపై మరో 40 నుంచి 50 సైరన్లు ఏర్పాటు చేస్తామని పీడబ్ల్యూడీ మంత్రి పర్వేష్ వర్మ తెలిపారు. ప్రతి సైరన్ పరిధి 8 కిలోమీటర్ల మేర ఉంటుందని చెప్పారు. రెండు రోజుల్లో వీటి ఏర్పాటు పూర్తవుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కమాండ్ సెంటర్ నుంచి ఈ సైరన్లను నియంత్రిస్తామని వెల్లడించారు. అవి 5 నిమిషాల పాటు మోగుతాయని వివరించారు.