తెలంగాణకు పెట్టుబడులు రాబట్టేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ పరిశ్రమల బృందం ఇవ్వాల అట్లాంటాలోని డెల్టా ఎయిర్ లైన్స్ కార్యాలయంలో.. సంస్థ వైస్ ప్రెసిడెంట్ అండ్ సీటీఓ నారాయణన్ కృష్ణకుమార్ తో సమావేశమైంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తుందని శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులకు వివరించారు. ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రజెంటేషన్ పై సంతృప్తివ్యక్తం చేసిన కృష్ణకుమార్ మరియు డెల్టా టీం.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.
పర్యటనలో పాల్గొంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలని కృష్ణకుమార్ ను కోరారు. నేరుగా విమానాలు లేకపోవడం వలన అమెరికాలో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్ధులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన డెల్టా ఎయిర్ లైన్స్ యాజమాన్యం హైదరాబాద్ కు నేరుగా విమానాలు నడిపేందుకు తక్షణం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధుల స్పందన పట్ల ఇరువురు మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు.
మంత్రులతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తోపాటు ఇతర బృందం పాల్గొన్నారు.