- జగన్ లోటస్ పాండ్ ఇంటి ముందు అక్రమ కట్టడాల కూల్చివేత
- పోలీసు భద్రత మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో అక్రమ నిర్మాణాల తొలగింపు కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ నివాసం ముందు సెక్యూరిటీ అవసరాల కోసం కొంత మేర రోడ్డును ఆక్రమించి రూములను నిర్మించారు.
దీంతో చాలా కాలంగా అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. మొన్నటి వరకు వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపధ్యంలో ఈ అక్రమ నిర్మాణాలపై ఎవరూ పిర్యాదు చేసే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు జగన్ అధికారం కోల్పోగానే ఆయన నివాసం ముందు నిర్మించిన అక్రమ కట్టడాలపై స్థానికులు జీహెచ్ ఎంసీ అధికారులకు పిర్యాదు చేశారు.
ఇంకేముంది వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ ఎంసీ అధికారులు లోటస్ పాంట్ లోని జగన్ నివాసం ముందు రోడ్డును ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చివేశారు. ఈ సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల భద్రత మధ్య జగన్ నివాసం ముందు నిర్మించిన అక్రమ నిర్మాణాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు జీహెచ్ ఎంసీ అధికారులు. మరోవైపు రాజకీయ కక్ష్యంలో భాగంగానే జగన్ నివాసం ముందు సెక్యురిటీ రూములను కూల్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.