జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికై కృష్ణతేజ
అమరావతి- యువ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా అభినందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగువాడైన ఐఏఎస్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక కావడం హర్షణీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణతేజ మరిన్ని సేవలందిస్తూ తోటి ఉద్యోగులు, యువతకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ప్రస్తుతం కేరళలోని త్రిస్సూర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
బాలల హక్కుల పరిరక్షణకు కృష్ణతేజ అత్యుత్తమ విధానాలు అనుసరించారని పవన్ కళ్యాణ్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థిలలో, కేరళ వరదల విపత్తుల సమయంలో కృష్ణతేజ అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన తెలుగుతేజం, ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ పురస్కారం లభించింది. ఈనెల 27న ఢిల్లీలో ఈ అవార్డును అందుకోనున్నారు.
కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను దాతల సహకారంతో ఉన్నత చదువులు చదివేలా కృషి చేశారు కృష్ణతేజ. మరోవైపు కరోనా టైంలో భర్తలను కోల్పోయిన 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటు, మరో 150 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. కృష్ణతేజ చేసిన కృషికిగాను కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్బంగానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృష్ణతేజను అభినందించారు.