తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 2025-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు సంబంధించి దోస్త్ (DOST – Degree Online Services Telangana) నోటిఫికేషన్ శుక్రవారం వెలువడింది. మే 3 నుంచి జూన్ 23 వరకు మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు మొదటి విడతలో రూ.200 చెల్లించాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక రెండు, మూడో విడతల్లో రూ.400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 3 నుంచి 21 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 10 నుంచి 22 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. విద్యార్థులకు మే 29న సీట్లను కేటాయించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 8 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు నిర్వహించి, మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. రెండో విడత సీట్లను జూన్ 13న కేటాయించనున్నారు. ఇక చివరి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించి.. జూన్ 13 నుంచి 19 మధ్య వెబ్ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. వీరికి జూన్ 23న సీట్లను కేటాయించనున్నారు.
ప్రవేశాల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 30 నుంచి డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి ‘దోస్త్’ ప్రవేశాల పరిధిలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో 1054 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో 136 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీలు 63 ఉన్నాయి. మిగిలినవి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,86,544 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీచేస్తారు.
ఇదీ షెడ్యూలు
మొత్తం మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బీకాం హానర్స్, బీఎస్డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
మొదటి దశ ప్రవేశాలు ఇలా..
మే 3 నుంచి 21 వరకు దోస్త్ మొదటి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన విద్యార్థులకు మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.
విద్యార్థులకు మే 29న మొదటి విడత డిగ్రీ సీట్లను కేటాయించనున్నారు.
రెండో దశ ప్రవేశాలు ఇలా..
రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది.
రెండో విడత వెబ్ ఆప్షన్లకు మే 30 నుంచి జూన్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు.
విద్యార్థులకు జూన్ 13న రెండో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
మూడో విడత ప్రవేశాలు ఇలా..
దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 13న ప్రారంభంకానుంది.
విద్యార్థులు జూన్ 19 వరకు దరఖాస్తులు సమర్పించాలి.
చివరి విడత వెబ్ ఆప్షన్లకు జూన్ 13 నుంచి 19 వరకు నిర్వహించనున్నారు.
విద్యార్థులకు జూన్ 23న మూడో విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు.
జూన్ 30 నుంచి కళాశాలల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి.