హైదరాబాద్ నగరంలో జరిగే రేవ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తోన్న ముగ్గురు సభ్యుల ముఠాను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వెంకట్ అనే బాయిస్ హాస్టల్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మోహిత్ లోకేష్ రావు, పుసుపులేటి యజ్ఞదత్తు, కె.ఎం. రవూప అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకొచ్చి, నగరంలో ఉంటున్న విద్యార్ధులకు అమ్ముతున్నట్లు పోలీసుల
విచారణలో గుర్తించారు. బెంగూళూరుకు చెందిన మోహిత్ లోకేష్ రావు, పుసుపులేటి యజ్ఞదత్తు, చిత్తూరు నుంచి బెంగూళూరులో ఉంటున్న కె.ఎం రవూప డ్రగ్స్ను తీసుకొచ్చి హైదరాబాద్లో గత కొంత కాలంగా విక్రయాలు జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీరు నగరంలో రేవ్పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ ముగ్గురు నిందితుల్లో కెఎం రవూపకు నైజీరియాకు చెందిన నెగ్గెన్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. తాజాగా మాదాపూర్లో రేవ్ పార్టీలో పట్టుబడిన నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన వారి వివరాలు సేకరించే క్రమంలో వీరిని గుర్తించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు.