బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత ఇంట్లో (శుక్రవారం) ఈ రోజు ఈడీ, ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది. ఎమ్మెల్సీ కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంట సేపటి నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా.. ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తుండటంతో పోలీసులు భారీగా ఆమె ఇంటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కవిత ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ దాడులు జరుగుతుండటంతో బీఆర్ఎస్ కేడర్ భయాందోళనలకు గురవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉందనే అనుమానంతో హైదరాబాద్లో పలు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైడ్స్ జరగడం చర్చానీయాంశంగా మారింది.