కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కే కేశవరావు, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకులే బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న కూడా ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. మళ్లీ తిరిగి సొంత గూటికి చేరిపోయారు. హైదరాబాద్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సోమవారం సోమన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఏపూరి సోమన్న మరోసారి చర్చనీయాంశంగా మారారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో తన పాటతో యువతను ఉత్తేజపరిచిన ఏపూరి సోమన్న ఆ తర్వాత వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన నచ్చక కెసిఆర్ కుటుంబంపై వ్యతిరేకంగా పాటలు పాడారు. అనంతరం పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన సమయంలో ఏపూరి సోమన్న కాంగ్రెస్లో యాక్టివ్గా పనిచేశారు.
ఆ తర్వాత వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరపున ప్రకటించిన మొదటి అభ్యర్థి కూడా ఏపూరి సోమన్నే కావటం గమనార్హం. కాగా, ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో కలిపేయటంతో సోమన్న కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.