తాను హరీశ్ రావుని రహస్యంగా కలిశాని వస్తున్న వార్తలను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఖండించారు. చావులు, పెళ్లిళ్ల దగ్గర మాత్రమే అనుకోకుండా హరీశ్ రావుని కలిశానని ఆయన అన్నారు. అంతేకానీ, ఏదో రాజకీయ చర్చలు చేసేందుకు ఎక్కడా కలుసుకోలేదన్నారు. బీజేపీయే తెలంగాణకు దిక్సూచి అని అన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన 3 తరాల ఉద్యమంలో అమరులను స్మరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వీరులను స్మరించుకున్నారు. తొలి దశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం 390 మంది అమరులైయ్యారని, ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ ఒకే మాటపై ఉందని ఆయన తెలిపారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు కాకినాడ తీర్మానానికి కట్టుబడి బీజేపీ పని చేసిందన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ దిక్సూచి అన్నారు. అనేక మంది యువకులు ప్రాణత్యాగాలు చేసినా.. సామాజిగా, ప్రజాస్వామిక తెలంగాణ అనేది కల గానే మిగిలిపోయింది. ఏ ఆకాంక్ష కోసం ఉద్యమం చేసామో అవి నేటికి నెరవేరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల ఉబ్బిలో ఇరుక్కుపోయింది.
నేడు బ్యాంక్ల దగ్గరకు పోతే దొంగల్లా చూస్తున్న పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం తప్పుకాదు. అందులో జరిగిన అవినీతి తప్పని బీజేపీ నేత అభిప్రాయాన్ని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలపై విచారిస్తున్న కమిషన్ ఆయనకు విచారణకు హాజరుకామని నోటీసులు పంపిన విషయం తెలిసిందే. విచారణకు కమిషన్ ముందు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.