చాలా రోజుల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో సమావేశమయ్యారు. రేవంత్ కు రాహుల్ సమయం ఇవ్వడం లేదని జరుగుతున్న ప్రచారానికి ఈ భేటీతో చెక్ పెట్టినట్లయింది. ఇప్పటికే పలుమార్లు రాహుల్ సమయం కోరినా.. ఇవ్వలేదు. దీంతో పలు రకాల ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లోనే శుక్రవారం రాత్రి హడావుడిగా సీఎం ఢిల్లీకి వెళ్లారు. శనివారం రాహుల్తో భేటీ అయ్యారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టెన్ జన్పథ్ నివాసంలో సమావేశమయ్యారు. రాహుల్ తో భేటీ కోసం చాలా రోజులుగా చూస్తున్న రేవంత్ రెడ్డికి.. సమయం కేటాయించడంతో ఢిల్లీ వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను.. కులగణన ఫలితాలను వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ అంశాపైనా వివరించారు. ఈ రెండు అంశాల ఆధారంగా తెలంగాణలో రెండు బహిరంగసభలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామని.. వాటికి హాజరు కావాలని రేవంత్ కోరినట్లుగా తెలుస్తోంది. రాహుల్ అందుబాటును బట్టి సభల తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. అదే విధంగా కొన్ని నామినేటేడ్ పదవులు, మంత్రి వర్గ విస్తరణపైనా చర్చించినట్లు తెలుస్తున్నది.