ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అందుకు కారణం మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్ వేడుక శనివారం జరగనుంది. మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు నేడు (మే 31న) హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. మే 7న మొదలైన మిస్ వరల్డ్ ఈవెంట్ నేటి గ్రాండ్ ఫినాలేతో పూర్తికానుంది. భారత్కు చెందిన నందిని గుప్తా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 108 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు 72వ ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నారు. అంత గ్రాండ్ ఈవెంట్కు హైదరాబాద్ వేదిక అయినందుకు తెలంగాణ ప్రభుత్వం హ్యాపీగా ఉంది. నేడు మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇండియన్ ప్రెజెంటర్ సచిన్ కుంభార్, 2016లో మిస్ వరల్డ్ విజేత స్టెఫానీ డెల్ వల్లే ఈవెంట్ హోస్ట్గా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ కట్టర్ ఫెర్మార్మెన్స్తో ఈవెంట్లో జోష్ తీసుకురానున్నారు. ఇదే ఈవెంట్లో స్టార్ యాక్టర్ సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యుమనిటేరియన్ అవార్డు ప్రదానం చేయనున్నారని తెలిసిందే. మిస్ వరల్డ్ ఈవెంట్ న్యాయనిర్ణేతలలో సోనూ సూద్ ఒకరు. ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి మరో జడ్జిగా వ్యవహరిస్తారు. మిస్ ఇంగ్లాండ్ 2014 కారీనా టర్రెల్ సైతం జడ్జి ప్యానెల్లో ఉన్నారు.
మిస్ వరల్డ్ విజేతకు ప్రైజ్ మనీ..
ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఈవెంట్ విజేతకు ఎంతో పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. మిస్ వరల్డ్ టైటిల్ విజేతకు భారీ ప్రైజ్మనీ లభిస్తుంది. మిస్ వరల్డ్ విజేతకు $1 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹8.5 కోట్లు) ప్రైజ్మనీ వరించనుంది. ఈ మొత్తాన్ని మిస్ వరల్డ్ సంస్థ, ఈవెంట్ స్పాన్సర్లు విజేత కోసం స్పాన్సర్ చేశారు. మొదట వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ కిరీటం ఆమెకు అలంకరించనున్నారు. మిస్ వరల్డ్ విన్నర్ కు ఏడాది పాటు లండన్లో ఉచితంగా నివాసం, డిజైనర్ కాస్టూమ్స్, నగలు, ఆమె మేకప్ కిట్, ఫుట్వేర్ లభిస్తాయి. వీటితో పాటు స్పాన్సర్ల నుండి ప్రత్యేక బహుమతులు అందుకోనున్నారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రాజెక్టు కింద ఆమె ప్రపంచంలో పలు దేశాల్లో పర్యటించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం సైతం విజేతకు బహుమతులు అందజేయనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్కు మొత్తం రూ.54 కోట్లు ఖర్చు అయింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం, టూరిజం శాఖ రూ.27 కోట్లు ఖర్చు చేయగా, మరో సగం వ్యయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరించింది.