•కేసీఆర్ కు, గజ్వేల్ కు మధ్య ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధం
•కాంగ్రస్ పాలనతో గజ్వేల్ కు రూపాయి పని చేశారా?
•కేసీఆర్ పై మాట్లాడే అర్హత రేవంత్ కు లేదు..
•గజ్వేల్ లో మాజీ మంత్రి హరీష్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దిగజారుడు, దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బుధవారం ఆయన గజ్వేల్ లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కు, గజ్వేల్ కు ఉన్నది తల్లీ పిల్లల పేగుబంధమని, కేసీఆర్ గజ్వేల్ ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. ఇవాళ ఆయన కృషితోనే గజ్వేల్ ను సకల సౌకర్యాలతో అలరారే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే కక్షలు, కుట్రలు, భౌతిక దాడులు, పోలీస్ కేసులు కేసీఆర్ వొచ్చిన తర్వాత గజ్వేల్ ను ప్రేమ, అభిమానాలకు, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా తీర్చిదిద్దారు. గజ్వేల్లో అనునిత్యం అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కొనసాగించారు. దేశ ప్రధానమంత్రిని కూడా గజ్వేల్ కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ దే.. ఎండకాలం వొచ్చిందంటే అక్కా చెల్లెల్ల బాధలు వర్ణణాతీతం.
గజ్వేల్ లో తాగునీటి కోసం కటకటలాడే వారు ట్యాంకర్లతో పాటు, ఆటోల్లో, రిక్షాల్లో, డ్రమ్ములు పెట్టుకొని మంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గ్రామాల్లో, గజ్వేల్ పట్టణంలో ఉండేది. కేసీఆర్ మిషన్ భగీరథ ను తెచ్చి చెల్లెళ్ల దాహార్తిని తీర్చారు. కేసీఆర్ ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లతో ప్రతి ఇంట్లోని అక్కా చెల్లెళ్లను పలకరిస్తున్నారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది – మిషన్ భగీరథ నీళ్లకు కోత పెట్టింది. మొదటి అంతస్తుకు నీళ్లొచ్చేవి, ఇవాళ నీళ్లు సరిగా రావడం లేదు ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక, కరెంటు లేక, ఉన్న భూములకు ధరల్లేక ఆత్మ విశ్వాసం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడే ప్రాంతంగా ఉండేది. కేసీఆర్ కృషితో ఇటు మల్లన్నసాగర్, అటు కొండ పోచమ్మ సాగర్, గలగల పారే గోదావరి జలలాతో ధాన్యలక్ష్మి తాండవం చేస్తున్నది.
ఎకరం 4-5 లక్షల్లేని భూముల ధరలు 1 కోటి నుంచి 4 కోట్ల వరకు పెరిగాయి. కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి దరిద్రపు పాలనతో గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైపోతున్నది, భూముల ధరలు పడిపోతున్నయి ఎవరికన్నా ఆపద ఉండి అమ్ముకుందామంటే, కొనే దిక్కు లేకుండా అయిపోయింది. కేసీఆర్ రాకముందు గజ్వేల్ లో పాఠశాలలు పాత బూత్ బంగ్లా వలె ఉండేవి. గజ్వేల్ ను బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ హబ్ గా మార్చారు. యూనివర్సిటీలతో, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టి కల్చర్ యూనివర్సిటీ, గురుకుల పాఠశాలలతో సరస్వతీ నిలయంగా తీర్చిదిద్దారు. ఎక్కడ గోదావరి – ఎక్కడ పాండవుల చెరువు, ఆనాడు విడాకుల పంచాయతీలకు కేరాఫ్ అడ్రస్ ఉండేది ఈ చెరువు ఇవాళ పసిపిల్లలు సాయంత్రం పూట కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు.
గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రోడ్డు అయితే నేనే వందసార్లు వచ్చిన 3 కిలో మీటర్ల 36 గుంతలు ఉంటుండేది. నాలుగు లేన్ల రహదారిని చేశారు. గజ్వేల్ కు కలగానే మిగిలిన, రైలును తెచ్చిండు కేసీఆర్, ఎరువులు దింపే రాక్ పాయింట్ పెట్టించారు. గజ్వేల్ కు – కేసీఆర్ కు మధ్య ఉండేది తల్లీ బిడ్డల అనుబంధం. కానీ, రేవంత్ రెడ్డి ఇవాళ చిల్లర మాటలు, కుళ్లు మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ మంజూరు చేస్తే, టెండర్లు అయి, నడుస్తున్న 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ గజ్వేల్ ను కండ్లల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధి మీద ఏడ్చారు. కేసీఆర్ అంటే రైతుబంధు – రేవంత్ అంటే రైతుబంధును మింగిన రాబందు.
నీ బూటకపు రుణమాఫీ సగం మందికి పైగా కానేలేదు నీ 15 నెలల పాలనలో గజ్వేల్ కు ఇచ్చిందేమీ లేదు. కేసీఆర్ పై మాట్లాడే అర్హత, హక్కు నీకు లేవు కేసీఆర్ వేల కోట్ల అభివృద్ధి చేసి చూపించారు.చిల్లర రాజకీయాలు రేవంత్ రెడ్డి మానుకోవాలి. ఆయన గజ్వేల్లో చిల్లర రాజకీయాలు మాట్లాడినా ప్రజలు కేసీఆర్ కే బ్రహ్మరథం పట్టారు. గజ్వేల్ మీద కేసీఆర్ ది కన్నతండ్రి ప్రేమ – రేవంత్ ది సవతి తల్లి ప్రేమ. నీది నిజమైన ప్రేమ అయితే రద్దు చేసిన 181 కోట్ల పనులను ప్రారంభించాలి. కేసీఆర్ ది గజ్వేల్ మీద కడుపు నింపే ప్రేమ, బతుకునిచ్చే ప్రేమ – రేవంత్ దేమో కపట ప్రేమ. గజ్వేల్ కు దశ దిశ ఇచ్చింది కేసీఆరే.. ఒక నాడు గజ్వేల్ అంటే గ్రామం, కరువు, తాగునీటికి కట కట.. ఇవాళ సకల వసతులతో కూడిన ఆదర్శ పట్టణంగా మారింది. మల్లన్నసాగర్ నిర్వాసితులు 90 శాతం మందికి 1260 కోట్లు కేసీఆర్ ఇచ్చారు. 10శాతం మిగిలిపోయిన వారికి కూడా 150 నుంచి 200 కోట్లు కూడా ఇవ్వాలి. మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం అసెంబ్లీలో నేను 26వ తేదీన కట్ మోషన్ ఇచ్చాం. మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని హరీష్ రావు స్పష్టం చేశారు.