Saturday, October 5, 2024

రేవంత్‌ ‌రెడ్డి మొనగాడు కాదు.. మోసగాడు

రేవంత్‌ ‌రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు
ఒక్క బస్సు తప్ప రేవంత్‌ ‌పాలన అంతా తుస్సే..
తొర్రూరు రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సెటైర్లు..

పది నెలల ప్రజాపాలనలో సీఎం రేవంత్‌ ‌రెడ్డికి రైతులు, ప్రజలు అంటే పట్టింపు లేదు.. ఆయన మొనగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్రంగా విమర్శించారు. మహబూబాబాద్‌ ‌జిల్లా తొర్రూరు రైతు ధర్నాలో హరీష్‌ ‌రావు పాల్గొని ప్రసంగించారు. రుణమాఫీ చేయడంలో రేవంత్‌ ‌సర్కార్‌ ‌విఫలమైంద‌ని, కొమరెల్లి మల్లన్న, యాదాద్రి, భద్రాద్రి, సమ్మక్క – సారలమ్మ మీద ఒట్టు పెట్టి మొనగాడిలా మాట్లాడాడ‌ని, కానీ ఆయ‌న‌ ఇప్పుడు ఆయన మోసగాడని తెలిపోయింద‌ని ఎద్దేవా చేశారు. రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్ని చేస్తాన‌ని ఇప్పుడు సప్పుడు లేదని అన్నారు. మొత్తం రుణమాఫీ అయ్యింది రాజీనామా చేయ్‌ ‌హరీష్‌ ‌రావు అని సవాల్‌ ‌విసిరాడు. మరి రుణమాఫీ అయితే ఇంత మంది రైతులు ధర్నాకు ఎందుకు వొచ్చారు..? పాలకుర్తి మండలంలోనే 4,314 మందికి రుణమాఫీ కాలేదు అని హరీష్‌రావు గుర్తుచేశారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు చెప్పారు.

మిగతా వారికి కాలేదు అన్నాడు.చెప్పిన 22 లక్షల మందిలో కూడా కొందరికి పూర్తిగా రుణమాఫీ కాలేదు. రకరకాల కారణాలతో రుణమాఫీ ఆపే యత్నం చేస్తున్నాడు రేవంత్‌ ‌రెడ్డి అని విమ‌ర్శించారు. రేవంత్‌ ‌మోసగాడు అని రైతులు, ప్రజలు అంటున్నారు అని హరీశ్‌రావు తెలిపారు. ఆగస్ట్ 15‌వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని అన్ని దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసగాడిగా మారారని హరీష్‌రావు విమర్శించారు. 31 కుంటి సాకులు చెప్పి రేవంత్‌ ‌రుణమాఫీ ఎగ్గొడుతున్నారని అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌ ‌రెడ్డి దసరాలోపు రైతుబంధు డబ్బులు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు. హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు. ఒక్క బస్సు తప్ప రేవంత్‌ ‌పాలన అంతా తుస్సేనని హరీష్‌రావు విమర్శించారు.

రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు. రేవంత్‌ ‌రెడ్డి గుండాగిరిచేస్తే బీఆర్‌ఎస్‌ ‌నేతలు చూస్తూ ఊరుకోరని హరీష్‌రావు వార్నింగ్‌ ఇచ్చారు. పాలకుర్తికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండి కూడా అభివృద్ధి జరగడం లేదన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఓ బ్లాక్‌ ‌మెయిలర్‌, అబద్దాలకోరు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు విమర్శించారు. శుక్రవారం తొర్రూరులో ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ‌మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో బీఆర్‌ఎస్‌ ‌నేతలు హరీష్‌రావు, సత్యవతి రాథోడ్‌, ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, మాలోతు కవిత, రుణమాఫీ కానీ రైతులు, బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకరరావు మాట్లాడుతూ… సీఎం అయ్యాక రేవంత్‌రెడ్డి అబద్దాలు ఎక్కువ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. రుణమాఫీ చేసేదాక వదిలిపెట్టామని ఎర్రబెల్లి హెచ్చరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular