మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై సోమవారం కేసు నమోదైంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై యేసుబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్కు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని యేసుబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా అరుంధతి హాస్పిటల్కు 40మంది సిబ్బందిని కేటాయించానని యేసుబాబు అన్నారు. మొత్తం రూ.50 లక్షలు ఇచ్చేందుకు రాజశేఖర్ రెడ్డి ఒప్పుకున్నాడని… పలు దఫాలుగా రాజశేఖర్ రెడ్డి రూ.30 లక్షలు చెల్లించాడని చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే రాజశేఖర్ రెడ్డి స్పందించలేదని యేసుబాబు ఫిర్యాదు చేశాడు. డబ్బులు ఇవ్వడం లేదంటూ యేసుబాబు పోలీసులను ఆశ్రయించాడు. రాజశేఖర్ రెడ్డిపై BNS చట్టం ప్రకారం చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో 316/2,318(4) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే మర్రి రాజశేఖర్ రెడ్డికి ఐదేళ్లు శిక్ష విధించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మర్రి రాజశేఖర్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.