ఏళ్లుగా అక్రమ వసలదారులను పంపిచేస్తున్నఅమెరికా
ఇది మన దేశానికే కాదు..అన్ని దేశాలకు వర్తిస్తుంది
రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటన
వలసదారులకు బేడీలు వేశారని విపక్ష ఎంపిల ఆందోళన
అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు పక్రియ కొత్తదేమీ కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉందని, ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదన్నారు. అన్నిదేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోందని, అమెరికా ట్రంప్ కార్యాయలం నుంచి గురువారం వెలువడిన వివరణపై జైశంకర్ స్పందించారు. 2012లో ఈ సంఖ్య 530గా ఉండగా.. 2019లో 2వేలకు పైగా ఉందని, అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలన్నారు.
తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు రప్పించడం ఆయా దేశాల ‘అని జైశంకర్ వివరించారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయులను స్వదేశానికి పంపించడంపై ఈ మేరకు కేంద్రమంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. డీపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అమెరికా నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే పక్రియను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటుందన్నారు.
అమెరికా వైఖరిని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు..
అయితే ప్రయాణ సమయంలో వారికి అవసరమైన ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు సమకూర్చినట్లు తెలిపారు. భారతీయులను అమెరికా వెనక్కి పంపించిన విధానాన్ని లేవనెత్తిన విపక్షాలు పార్లమెంటులో నిరసనలు చేపట్టాయి. దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. అమెరికా ప్రభుత్వ యంత్రాంగంతో తీసుకుంటున్న దౌత్యచర్యల గురించి వివరించాలని కోరాయి. దీనిపై లోక్సభ స్పీకర్ స్పందిస్తూ.. ఈ అంశం విదేశాంగ మంత్రిత్వశాఖకు సంబంధించినదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. ఇలా ఉభయసభలకు అంతరాయం కలుగుతోన్న క్రమంలోనే రాజ్యసభలో కేంద్ర మంత్రి దీనిపై ప్రకటన చేశారు. దీనికి ముందు జైశంకర్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మరోవైపు, వలసదారుల భద్రత కోసం కేంద్రం కొత్త చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులు బుధవారం అమృత్సర్లో దిగారు.
వారిని అమానవీయ పరిస్థితుల్లో తరలించారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానితో విదేశాంగ మంత్రి భేటీ అయ్యారు. ఇక ప్రతిపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దిగువసభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఈ అంశంపై మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు. అలాగే విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రస్తుతం వలసదారులు వెనక్కి రావడంతో కేంద్రం వారి భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించేలా ఈ కొత్త చట్టంలో విధివిధానాలు ఉండనున్నట్లు సమాచారం.
‘గతంలోనూ భారత వలసదారులను స్వదేశానికి తరలించారు. కానీ ఈవిధంగా మాత్రం జరగలేదని కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ అన్నారు. మన పౌరుల చేతికి బేడీలు వేయడం అవమానకరం ‘అని థరూర్ విమర్శలు చేశారు. భారత వలసదారులచేతులకు సంకెళ్లు.. కాళ్లకు గొలుసులు వేసి స్వదేశానికి పంపించినట్లు కొన్ని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఇదికాస్తా రాజకీయ వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది. ఆ ఫొటోల్లో ఉన్నది భారతీయులు కారని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్చెక్ డిపార్ట్మెంట్ ఆ ఫొటోలపై నిజ నిర్దరణ పక్రియ చేపట్టింది. అందులో అవి ‘ఫేక్’ అని తేలినట్లు పీఐబీ వెల్లడించింది.