తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐదుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చనిపోయారు. తిరువళ్లూరు పర్యటనకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్ధులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పవడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్శటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఏపీకి చెందిన విద్యార్ధులు ఆదివారం సెలవు కావడంతో శనివారం సాయంత్రం తిరువళ్లూరు అరుణాచల ఆలయ దర్శనం కోసం బయల్దేరారు.
స్వామి వారి దర్శనం తరువాత ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ స్టూడెంట్స్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. లారీ ఢీకొట్టడంతో విద్యార్ధులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరుకు చెందిన నితీష్ (22), తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామోహ్మన్(21), విజయవాడకు చెందిన బన్ను నితీష్(22) చనిపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్యకు తీవ్ర గాయాలవ్వడంతో వారిని తిరువళ్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.