బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 61 మంది చనిపోయారు. సావో పాలోలోని విన్హెడోలో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో క్యారియర్ వోపాస్ కు చెందిన ఈ విమానం కూలిపోయింది. పరానాలోని కాస్కావెల్ నుంచి సావో పాలో గౌరుల్హోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా విన్హెడో పట్టణంలోని నివాస ప్రాంతంలో ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణీకులు, సిబ్బంది మొత్తం 61 మంది మృతి చెందారు. విమానంలో 57 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలగానే భారీగా మంటలు ఎగసి పడ్డాయి. విమాన ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను ఆర్పి రెస్య్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమయ్యారు. ఈ విమాన ప్రమాద ఘటనకు గల కారణాలపై విచారణ చేపట్టామని బ్రెజిల్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఎయిర్ బ్రిగేడియర్ మార్సెలో మోరెనో తెలిపారు. ప్రమాదాన్ని నియంత్రించడానికి విమానం ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిని కమ్యూనికేట్ చేయలేదని చెప్పారు. విమాన ప్రమాదంలో ఒక ఇల్లు మాత్రం పాక్షికంగా దెబ్బ తిన్నది. ఐతే అదృష్టవశాత్తూ స్థానిక నివాసితులు ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు.