మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది
బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించింది
పాదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేస్తున్నాం
అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా.. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంతో సఫలీకృతమయ్యామన్నారు. అంబేద్కర్ సూచనలను అనుసరిస్తూ ప్రజాపాలన చేస్తున్నామన్నారు. అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గత పదేళ్లలో విధ్వంస పాలన సాగిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంపై నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. సొంత మీడియాలో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు.
సమ్మిళిత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నామని మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వరి బోనస్ కింద రూ.1,206 కోట్లు చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.12,511 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని. విద్యావ్యవస్థ బలోపేతానికి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని తీసుకొస్తున్నామన్నారు. 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని.. కులమతాలతో సంబంధం లేకుండా ఇంటిగ్రేటెడ్ సూళ్లలో బోధన ఉంటుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండనున్నట్లు తెలిపారు. ప్రతి సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ పథకం అమలులోకి తీసుకొస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు.
మహిళల సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి :
“మన దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ, తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, లోక్ సభ తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ వంటి మహిళలు ఎంతో సమర్థవంతంగా పనిచేసి వారి పదవులకే వన్నె తెచ్చారు. మన దేశంలోని ప్రతి మహిళకు కూడా అదే సమర్థత ఉందని మా నమ్మకం.భారత దేశ సుస్థిరతకు కుటుంబ వ్యవస్థే పునాది, అందులో మహిళలదే ప్రముఖ పాత్ర. వారి ఆర్థిక స్వావలంబన కుటుంబ స్వావలంబనకు, దేశాభివృద్ధికి ఎంతో కీలకం.స్త్రీ శక్తే దేశ శక్తి అని విశ్వసించి ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ప్రారంభించాం. ఈ మిషన్ తో తెలంగాణలో మహిళా సాధికారతకు నూతన శకం ప్రారంభమయింది. ఈ పథకంలో రూ.20 వేల కోట్ల రుణాన్ని అందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ లక్ష్యాన్ని కూడా అధిగమించి, ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల (21,632 కోట్లు) రూపాయల రుణాలని స్వయం సహాయక సంఘాలకు అందించాం..”
నల్లపోచమ్మకు పూజలు
శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా బుధవారం ప్రజాభవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులకు పూజల అనంతరం ఆలయ పూజారులు ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులను తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి అందజేశారు. ఆయన వెంట శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు ఉన్నారు. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు బడ్జెట్ ప్రతులను అందజేశారు.