టీఎస్ న్యూస్:
హైదరాబాద్లో బుధవారం తెల్లవారు జామున రెండు వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఆయిల్ గోదాంలో కాగా.. మరొకటి ప్లాస్టిక్ పరిశ్రమలో సంభవించింది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. మంటలు అంటుకున్న వెంటనే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, కాటేదాన్లో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి.
కాటేదాన్లో ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల మాదిరిగా పరిశ్రమలు వెలిశాయి. ముందస్తు కనీస జాగ్రత్తలు సైతం పట్టించుకునే వారు లేరు. దాని ఫలితమే తరుచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్ లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు.