భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
17 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో అగ్రనేత జగదీశ్.. అతని తలపై 25 లక్షల రివార్డు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీగా కాల్పుల మోత మోగింది. భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య కొన్ని గంటల పాటు భీకర కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో 17 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. వీరిలో కీలకనేత దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఉన్న జగదీష్ మృతి చెందాడు. ఇతడిపై 25 లక్షల రివార్డును డిప్యూటీ సిఎం విజయ్ శర్మ ప్రకటించారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గోగుండ కొండపై మావోయిస్టు పార్టీలు సమావేశమయ్యారని పక్కా సమాచారం తెలుసుకున్న భద్రత బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.
మావోయిస్టులను కనుగొనేందుకు దండకారణ్యాన్ని జల్లెడపడుతున్న భద్రత బలగాలను మావోయిస్టులు కనుగొని కాల్పులు జరుపడంతో అందుకు ప్రతిఘటించి భద్రత బలగాలు కాల్పులు జరుపడంతో 17 మంది మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా దవాఖానకు తరలించారు. సుక్మా, దంతెవాడ సరిహద్దులోని ఉపంపల్లి , కెర్లపాల్ ప్రాంతంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. డిఆర్జి , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , సిఆర్పిఎఫ్ సిబ్బంది, ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సుక్మా ఎస్పీ పూర్తిస్థాయిలో పర్యవేక్షించారు.
మూడు నెలల్లో 100 మంది మృతి
2025 జనవరి నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. బీజాపూర్, సుక్మా జిల్లాలో ఎక్కువగా ఈ ఎన్కౌంటర్లు జరిగాయి. ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులను గుర్తించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మిగతా మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నారు. సుక్మా జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ను సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ ధ్రువీకరించారు. సంఘటన స్థలం వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకె47, ఎస్ఎల్ఆర్, ఇన్సార్ రైఫిల్, 303 రైఫిల్, రాకెట్ లాంఛర్, బిజిఎల్ లాంఛర్, ఆయుధాలతో పాటు భారీ పేలుడు సామగ్రిని సంఘటన స్థలం వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన కీలక నేత జగదీష్పై సుక్మా జిల్లాలో 12కు పైగా కేసులు ఉన్నాయి. అలాగే ఇతడిపై రూ.25 లక్షల రివార్డు కూడా ఉంది.
చత్తీస్గఢ్లోని సుక్మా , దంతెవాడ, బీజాపూర్ దండకారణ్యం మావోయిస్టులకు సేఫ్ జోన్గా ఉండేది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. 2026 నాటికి మావోయిస్టులను సమూలగా నిర్మూలిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా ప్రకటించారు. ఇందుకోసం భారీగా భద్రత బలగాలను అటవీ ప్రాంతంలోకి దింపింది. సేఫ్ జోన్గా బావించిన ఛత్తీస్గఢ్ దండకారణ్యం ఇప్పుడు మావోయిస్టుల పాలిట శాపంగా మారింది.
తరచూ ఎన్కౌంటర్లు జరుగుతుండడంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 234 మందికి పైగా మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోయింది. 2025 జనవరి నుంచి మార్చి వరకు 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రతీసారి ఎవరో ఒక కీలక నేత మృతి చెందుతూనే ఉన్నారు. తరచూ కీలక నేతలను కోల్పోతుండడంతో మావోయిస్టు పార్టీ బలహీనపడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకోసమే మావోయిస్టులు మరో సేఫ్ జోన్ కోసం తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.