అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో హైదరాబాద్కి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషయంలో తెలియగానే యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. హైదరాబాద్లోని చైతన్యపురి పరిధిలో ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ మూడేళ్లు కిందట అమెరికా వెళ్లాడు. అక్కడే మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడి కాలమానం ప్రకారం.. ఆదివారం వాషింగ్టన్కు వెళ్లాడు. ఏవ్లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు రవితేజ. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈలోగా అంబులెన్స్లు వచ్చాయి. అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.
రవితేజ చనిపోయిన విషయాన్ని అక్కడికి పోలీసులు హైదరాబాద్లో పేరెంట్స్కి తెలిపారు. ఫోన్లో కొడుకు లేడన్న సమాచారం విన్నగానే పేరెంట్స్ షాకయ్యారు. అతడి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.