- నగరంలోని హెచ్ఐసిసిలో రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు
- హాజరుకానున్న సుమారు 2 వేల మంది ప్రతినిధులు
- సదస్సును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దేశంలోనే మొదటి సారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సుకు హైదరాబాద్ నగరం ముస్తాబు అయింది. ఇందుకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసిసి) వేదిక కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు కు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ” ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సు తో పని ” అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహించడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రధానంగా ఏఐ రంగం అభివృద్ధి కి తమ ఆలోచనలు, భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు.
అలాగే కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్లను ఈ సదస్సు లో ప్రదర్శిస్తారు.రెండు రోజుల పాటు జరిగే ఈవెంట్లో హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు ఏర్పాటు చేసింది. రాష్ట్రా న్ని ఏఐ హబ్ గా తీర్చి దిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికాలో పర్యటించిన రేవంత్ రెడ్డి…ఏఐ రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ఏఐ సేవలను అబివృద్ధి అవకాశాల తో.. భవిష్యత్తు కార్యాచరణ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది.
దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఈ గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేస్తారు. కాగా ఆరోగ్య భద్రత, జీవశాస్త్రాలు, విద్య, వ్యవసాయం, న్యాయవ్యవస్థ, తయారీ రంగం, పౌర సేవలు ఇత్యాది రంగాలలో ఏఐ ఆధారిత నవీకరణల ప్రగాఢ, విస్తార ప్రభావ ప్రాబల్యాలను అధ్యయనం చేసి, సంబంధిత మార్పులపై మన అవగాహనను మరింతగా మెరుగుపరచుకునేందుకు ఆ సమ్మిట్ దోహదం చేయనుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే పెరుగుతున్న ట్రాఫిక్ జామ్లను తగ్గించడం నుంచి అధిక దిగుబడులు సాధించడంలో రైతులకు తోడ్పడడం వరకు ప్రభుత్వాలు తమ పౌరులకు అందిస్తున్న సేవల తీరుతెన్నులను ఎఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది.
రాష్ట్రంలో సంప్రదాయక వ్యవసాయక సవాళ్లు అధిగమించేందుకు ఎఐని ఫలప్రదంగా ఉపయోగిస్తున్నారు. పంట సమాచారం, సాగు భూముల పరిస్థితులను విశ్లేషించడం ద్వారా ఏఐ, రైతుల వైయక్తిక అవసరాలకు అనుగుణమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ దిగుబడులను అధికం చేస్తోంది. దీనిని ఉపయోగించుకున్న రైతులు ఎకరాకు సగటున 21 శాతం అధిక దిగుబడిని సాధించారు.
పంటల సాగులో వారు ఉపయోగించే క్రిమిసంహారక మందుల వినియోగం 9 శాతం, ఎరువుల వాడకం 5 శాతం తగ్గిపోగా దిగుబడుల విక్రయ ధరలు 8 శాతం మేరకు పెరిగాయి. హైదరాబాద్లోను, ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలలోను రోడ్లపై వాహనాల రాకపోకకలను మరింత సమర్థంగా క్రమబద్ధం చేసేందుకు ఏఐ తోడ్పడుతున్నది.