రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లే కాదు.. తెలంగాణ సెక్రెటేరియట్లో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపుతోంది. సీఎంఓతో సహా మంత్రుల పేషిలు, అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు రూఢీ అయింది. అంతేకాదు.. తాజాగా విద్యాశాఖ, పర్యాటక శాఖపై సీఎం రివ్యూ చేయగా.. అక్కడ కూడా నాసిరకం ఫుడ్ పంపినట్లు తెలిసింది. అయితే, అదే ఫుడ్, స్నాక్స్ తిన్న డిప్యూటీ సీఎంకు రెండుసార్లు వాంతులు కాగా.. సీఎంకు కూడా రియాక్షన్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రతిరోజూ ఫుడ్ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫుడ్ సరఫరా చేసే కాంట్రాక్టర్తో వెంటనే మాట్లాడాలని సైతం హెచ్చరించారు.
తెలంగాణలో ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కు ఫుడ్ పాయిజన్ బెడదా తప్పలేదు. సీఎంఓ తో సహా మంత్రుల పేషిలకు, కీలక శాఖ అధికారులకు నాసిరకం భోజనం సప్లై చేసినట్లు తెలుస్తోంది. పలువురు అధికారులకు ఫుజ్ పాయిజన్ కావడంతో ఈ అంశం వెలుగులోకి రాగా సప్లై దారుపై పలువురు సిబ్బంది ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ చర్యలు శూన్యమని సెక్రటేరియట్ సిబ్బంది, కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రయోజనాల కోసం తమ ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రోటోకాల్ ఫుడ్ మానేసిన అధికారులు
సీఎం రేవంత్ తోపాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ప్రముఖులకు సైతం ఇదే భోజనం వడ్డిస్తున్నట్లు సిబ్బంది అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రోటోకాల్ ఫుడ్ మానేసి తమ సొంతంగా పలువురు మంత్రులు, వారి పేషి సిబ్బంది భోజనం తెప్పించుకుంటున్నారు. అయితే ఈ ఇష్యూ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. శుక్రవారం పలు సమీక్షల సందర్బంగా సీఎంకు, మంత్రులకు పంపించిన స్నాక్స్.. ప్రధానంగా సమోసా నుంచి వాసన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇది తిన్న డిప్యూటీ సీఎం భట్టి కొద్ది సమయంలో వాంతులు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు సీఎంకు కూడా అదే పరిస్థితి. దీంతో ఈ ఫుడ్ సరఫరాపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఫుడ్ తనిఖీ చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మీ నిర్లక్ష్యపు చర్యలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
ఫుడ్ పాయిజన్ ఘటనలు బాధాకరం
ఇటీవలే ఫుడ్ పాజియన్ ఘటనలై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఫుడ్ పాయిజన్ కారణంగా పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎంతో బాధ ఉంటుందన్నారు. శ్రీమంతుడుకి , పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది. మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే.. మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది మన గౌరవ ప్రతిష్టలను పెంచేదా.. తగించేదా..?, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ నెలా 10వ తేదీలోగా గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు అందజేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు రుసుం రూ.25 నుంచి రూ.75 కు పెంచి వారికి అప్పగించాం. వారంలో రెండు,మూడు రోజులు రెసిడెన్షియల్ పాఠశాలలను సందర్శించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.