Thursday, May 22, 2025

అడవుల్లో పులి వేట పట్టిస్తే రూ.4 కోట్లు

అడవికి రారాజుకు ఆపదొచ్చింది. పులిని చూస్తే మనిషికి పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి క్రూర జంతువును కూడా చంపేస్తున్నారు వేటగాళ్లు. ఖరీదైన పులి చర్మం, గోళ్ల కోసం జంతువు కన్నా క్రూరంగా చంపేస్తున్నారు. అందుకే, ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో పులులకు రక్షణ లేకుండా పోతోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే పులులు హతమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పులి చర్మం, దంతాలు, గోళ్ల కోసం పులులను చంపేస్తున్నారు. దీంతో అలాంటి క్రూర వేటగాళ్లను పట్టుకునేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. వేటగాళ్లను పట్టిస్తే ఏకంగా రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు.

మళ్లీ పులి బలి
ఆసిఫాబాద్ పులుల కారిడార్ ప్రాంతం వేటగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారింది. 2024లో K 15, S 9 అనే రెండు పులులు దరిగాం అటవీ ప్రాంతంలో మరణించాయి. విషపూరితమైన పశువుల మాంసం తినడం ద్వారా మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గతంలోనే ఇద్దరు రైతులు, ఒక బాలుడిని అరెస్టు చేశారు. తాజాగా ఈ నెల 14న రాత్రి వేటగాళ్ల ఉచ్చుకు కాగజ్ నగర్ డివిజన్ పెంచికల్ పేట రేంజ్‌లో మరో పులి బలైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15న ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన కూలీలు చనిపోయిన పులిని చూసి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అధికారులు వెతకగా పులి కళేబరం కనబడలేదు. కానీ ఘటన స్థలానికి 400 మీటర్ల దూరంలో జంతువును పూడ్చిన ఆనవాళ్లు కనిపించాయి. అనుమానం వచ్చి తవ్వగా చర్మం, గోళ్ళు, దంతాలు లేకుండా ఉన్న జంతువు కళేబరం లభించింది. పోస్ట్ మార్టం నిర్వహించగా ఏడు నుంచి ఎనిమిది ఏళ్ళ ఆడ పులిగా నిర్ధారించారు.

ఐదుగురు వేటగాళ్లు..
పులి గోళ్లకు, చర్మానికి, పళ్లకు మంచి డిమాండ్‌ ఉండటంతో వేటగాళ్లు పులులను చంపేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా పెంచికల్ పేట రేంజ్‌లో వేటగాళ్ల ఉచ్చుకు బలైన పులి K8 పులేనా కాదా? అనేది అధికారులు నిర్ధారణకు రాలేకపోతున్నారు. చర్మం లేకుండా ఉండటంతో పులిని గుర్తించడం అధికారులకు సవాల్‌గా మారింది. అనుమానితులు, గతంలో ఇలాంటి కేసుకు సంబంధం ఉన్న 40 మందిని అదుపులోకి తీసుకుని విచారించి.. ఐదుగురిని గుర్తించారు అధికారులు. వీళ్లను విచారించగా నిజాలు బయటకు వచ్చాయి. పులి అవశేషాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జనవరిలో కాగజ్ నగర్ మండలం షెర్కేపల్లి అటవీ ప్రాంతంలో K15, S9 రెండు పులులు మృతి చెందాయి. ఆడ పులి మృతి చెందడంతో మరో పులి జాడ కోసం అటవీ అధికారులు ట్రాకింగ్ బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఇదే క్రమంలో మృతి చెందిన పెద్ద పులి మృతదేహం లభించింది. ఆడ పులి మృతదేహం లభించిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మరో పులి మృతదేహం లభించింది. పులుల మధ్య జరిగిన ఘర్షణలో పులి పిల్ల చనిపోయినట్లు మొదట అధికారులు భావించారు. అయితే వెంటనే మగపులి చనిపోవటం దానికి ఉచ్చు బిగిసి ఉండడంతో విషప్రయోగం జరిగినట్లు అధికారులు తేల్చారు.

పట్టిస్తే రూ.4 కోట్లు
పులులను వేటగాళ్ల బారి నుంచి కాపాడుకోలేకపోవడం అధికారుల వైఫల్యమేననే విమర్శలు వస్తున్నాయి. పులుల కదలికలను ట్రాక్ చేయడానికి అటవీ శాఖ కెమెరా ట్రాప్లను సైతం ఉపయోగిస్తోంది. అయినా లోపం ఎక్కడుందో తెలియదుకానీ పులులు మాత్రం వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. అయితే వేటగాళ్లను పట్టుకునేందుకు సమాచారాన్ని అందించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి.. ప్రభుత్వం సీక్రెట్ సర్వీస్ ఫండ్ ఏర్పాటు చేసి.. రూ.4 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com