స్వాగతించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాలు ముందుగానే అసెంబ్లీకి వొచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత పదిహేను నెలలుగా ప్రధాన ప్రతిపక్షనేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదన్న విమర్శల నేపథ్యంలో.. ఈసారి అసెంబ్లీకి హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 50 నిమిషాలు ముందుగానే కేసీఆర్ అసెంబ్లీకి వొచ్చారు. అసెంబ్లీకి వొచ్చిన కేసీఆర్.. ముందుగా అసెంబ్లీ ఇన్నర్ లాబీలోని బీఆర్ఎస్ఎల్పీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత సమావేశమయ్యారు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వొచ్చినా పలువు పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు సమయానికి సభకు రాలేదు. మంగళవారం జరిగిన ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ సభ్యులంతా ముందుగానే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ ఆ పార్టీలోని పలువురు సభ్యులు మాత్రం తీరుమార్చుకోని పరిస్థితి.మరోవైపు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రతిపక్షనేత కేసీఆర్ను అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ కలిశారు. మర్యాదపూర్వకంగానే కేసీఆర్ను కలిశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో ఆదినారాయణ బీఆర్ఎస్లో పనిచేశారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. అయితే అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ముఖ్యమంత్రి పేరు ఏంటంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణను అడిగారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. అయితే బీఆర్ఎస్ ప్రోడక్ట్ కాబట్టి సరైన సమాధానం చెప్పారంటూ కేటీఆర్ టీజ్ చేశారు. అయితే 2014 ఎన్నికల్లో అశ్వారావుపేట నుంచి బీఆర్ఎస్ తరవున ఆదినారాయణ పోటీ చేసిన విషయం తెలిసిందే.