- దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు కేంద్ర భావిస్తోంది..
- రాష్ట్ర మంత్రులు, ఏం చేస్తున్నట్టు?
- కేంద్ర బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు
తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకుందని, బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం చోటు లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. యూనియన్ బడ్జెట్ పై ఆయన విమర్శలు గుప్పించారు. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లె వేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని హరీష్ రావు కోరారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు.
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన నిర్మల సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నదని మండిపడ్డారు. 2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 దిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉంది.
తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది. కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోసపోయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు 40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఏడాది కాలంలో 30 సార్లకు పైగా దిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందన్నారు.
ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బీహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు. బీహార్ లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్ లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, బిహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు. 8 మంది బిజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం, ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు చెప్పాలి. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు మౌనం దాల్చారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైందని హరీష్ రావు అన్నారు.