సైబర్ నేరగాళ్లు చదువుకున్న వారిని సైతం మోసం చేస్తున్నారు. తాజాగా ఒక మాజీ ఐఏఎస్ అధికారి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 3.37 కోట్లు పోగొట్టుకున్నారు. ట్రేడింగ్ యాప్ లింక్ ద్వారా పరిచయం పెంచుకున్న సైబర్ నేరగాడు, అధికారికి నమ్మకం కలిగించి భారీగా డబ్బులు కాజేశాడు. పలు విడతలుగా మొత్తం 3.37 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాల, మోసగాళ్ల గురించి పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా.. జనాల చెవికి ఎక్కడం లేదు. ఏదో విధంగా మాయగాళ్ల వలలో పడి.. భారీగా సమర్పించుకుంటున్నారు. మరి ఇలా మోసపోతున్న వారి జాబితాలో కేవలం నిరక్షరాస్యులు, సామాన్యులు మాత్రమే ఉన్నారా అనుకుంటే పొరపాటు. బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం ఏమారుస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మాజీ ఐఏఎస్ అధికారినే బురిడీ కొట్టించాడో సైబర్ నేరస్థుడు. సదరు అధికారి ఖాతా నుంచి ఏకంగా రూ.3.37 కోట్లు ఊడ్చేశాడు.
స్టాక్మార్కెట్లో భారీలాభాలు ఆర్జించొచ్చంటూ సైబర్ నేరస్థుడు.. విశ్రాంత ఐఏఎస్ను మాయ చేశాడు. అంతేకాక విడతల వారీగా ఆయన బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తూ.. మొత్తంగా రూ.3.37 కోట్లు ఊడ్చేశాడు. సదరు అధికారి.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్(72) కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని సోమాజీగూడలో నివాసముంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన సెల్ఫోన్కు ట్రేడింగ్ ప్లాట్ఫాం పేరిట ఒక లింక్ వచ్చింది. అయితే సదరు అధికారికి ట్రేడింగ్ మీద ఆసక్తి ఉండటంతో.. ఆ మెసేజ్కు స్పందించాడు. దీంతో సైబర్ నేరగాడు.. తాను కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అర్జున్ మెహతాను అంటూ.. మాజీ ఐఏఎస్ అధికారితో పరిచయం పెంచుకున్నాడు. ఈక్రమంలో తాము రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో మ్యూచువల్ ఫండ్స్, ఐపీవోల్లో పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయంలోనే 120-160 శాతం వరకు లాభాలు పొందొచ్చని సైబర్ నేరగాడు.. అధికారికి ఆశ చూపాడు
బోనస్ డబ్బులు ఇవ్వడంతో నమ్మిన అధికారి..
నేరస్థుడి మాయమాటలు నమ్మిన మాజీ ఐఏఎస్ అధికారికి.. సైబర్ నేరస్థుడు రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వాట్సప్ వీడియోకాల్ చేస్తూ షేర్మార్కెట్ వ్యవహారాలపై సలహాలు ఇస్తుండే వాడు. గ్లోబల్ ప్లాట్ఫాంపై పోటీపడుతున్న తనకు అనుకూలంగా ఓటు వేయాలని.. అలా చేస్తే తాను నంబర్వన్ స్థానానికి చేరుకుంటున్నానని తెలిపేవాడు. అంతేకాక సదరు అధికారిని నమ్మించడం కోసం.. తాను ఫస్ట్ ప్లేస్కి చేరుకున్నానంటూ.. అప్పుడప్పుడు 5వేలు, 10 వేల రూపాయలు బోనస్గా ఇచ్చేవాడు. అలా నెమ్మదిగా సైబర్ నేరస్థుడు సదరు మాజీ ఐఏఎస్ నమ్మకం సంపాదించాడు.