సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు
అబద్దాల ప్రచారానికి గవర్నర్ ను సైతం వాడుకున్న కాంగ్రెస్
గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు
గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు. గవర్నర్లు మారారు తప్ప, ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ఆయన స్పందిస్తూ చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లు.. అబద్దాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తో ప్రభుత్వం చెప్పించిందన్నారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనం. రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్ ని కూడా వాడుకోవడం సిగ్గుచేటు. గవర్నర్.. మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలుపెట్టారు.
“నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే” అని, నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం దిల్లీ సేవలో, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అన్నారు. ఎవరి లైవ్స్ ట్రాన్స్ ఫార్మ్ చేశారు. లగచర్ల, న్యాల్కల్, అశోక్ నగర్ లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్. ఇవ్వాళ కూడా ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరిట పెద్ద ట్రాన్స్ ఫర్మేషన్ చేశారు. ప్రజల సేవను పక్కన బెట్టి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం స్వయం సేవా, దిల్లీ సేవలో తరిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా? వ్యవసాయం పెంచింది ఎవరు గొప్పలు చెబుతున్నారు.
34లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల మాగాణం గా మార్చింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వల్ల అది సాధ్యమైందన్నది వాస్తవం. గొప్పగా చెప్పిన 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పదేళ్ల కృషితో సాధ్యమైందా, మీ ఏడాదిన్నర పాలనలో సాధ్యమైందా? రుణమాఫీ అనేది పెద్ద బోగస్. 49వేల కోట్ల రుణమాఫీ అన్నరు. బడ్జెట్ లో 31 వేల కోట్లు చెప్పి, 20వేల కోట్లు చేసినం అని ప్రచారం చేసుకుంటున్నరు. 14, 15 వేల కోట్లు కూడా చేయలేదు. రైతు భరోసా 15వేలు ఇస్తమని, సిగ్గులేకుండా 12వేలకు తగ్గించి దాన్ని గొప్పగా గవర్నర్ ప్రసంగంలో చెప్పుకున్నారు. రైతు కూలీలకు 12వేలు ఇస్తున్నమని పచ్చి అబద్దం చెప్పించారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి అయినా ఎవరి ఖాతాల్లో అయినా పడిందా? అసలు 566 రైతు వేదికలు కట్టింది ఎవరు. అది కూడా మీ ఘనతేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు. 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయి. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కృష్ణా జలాలు ఆంధ్రా దోచుకుపోతుంటే మౌనంగా ఉన్న మీరు దాని గురించి మాట్లాడటం సిగ్గుచేటు. ఆరు గ్యారెంటీల్లో మహాలక్ష్మి మొదటి హామీ నెలకు 2500 ఇప్పటికి దిక్కులేదు.
ఇంకా దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పుకుంటున్నారు. ఎస్ జీ హెచ్ లకు ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని అబద్దం చెప్పారు. పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని యువతను మోసం చేసారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారు. గురుకులాల్లో 83 మంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదు. పోలీసు భద్రత అమలు కావడం లేదు. గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు. సామాజిక న్యాయం.. బీసీలకు న్యాయం కోసం 42శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం బిల్లు పెడుతున్నారని పేర్కొన్నారు. బీసీల కులగణన తప్పుల తడకగా చేసి.. ఇప్పుడు ఏ ప్రాతిపదికన బిల్లు పెడతారు?
తప్పుల కులగణన చేసిన రోజును సామాజిక న్యాయ దినోత్సవంగా ఎలా జరుపుతారు. కనీసం అంబేడ్కర్ విగ్రహానికి దండ కూడా వేయని వాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని నిలదీశారు. గుజరాత్, తమిళనాడు, ఆంధ్రాకు తెలంగాణకు వొచ్చిన పరిశ్రమలు తరలిపోతున్నాయని మీడియా కోడై కూస్తున్నది. లక్షా 78వేల కోట్ల పెట్టుబడులు వొచ్చాయని గొప్పలు చెబుతున్నారు. అసలు దావోస్ లో జరిగే ఒప్పందాలు ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంటెంట్ అని మీ ఉప ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటి వరకు మీరు చెప్పిన ఒప్పందాలు ఎన్ని గ్రౌండ్ అయ్యాయి శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎంఎస్ఎంఇలు ఇబ్బందులు పడుతుంటే, కొత్త పాలసీ అని డబ్బా కొడుతున్నారని మండిపడ్డారు.