పార్టీలోకి రావాలని ఆహ్వానించిన సిఎం రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ ఎంపి, బిజెపి నేత జితేందర్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం కలిశారు. మహబూబ్నగర్ ఎంపి టికెట్ బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణకు ప్రకటించడంతో పార్టీ అధిష్టానంపై జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా సమాచారం. సిఎంతో చర్చల అనంతరం కాంగ్రెస్లోకి రావడానికి జితేందర్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలిసింది.
పార్టీ మారే ఆలోచన లేదు: జితేందర్ రెడ్డి
అయితే సిఎం రేవంత్ వెళ్లిపోయిన తరువాత బిజెపి కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తన ఇంటికి తరుచూ వస్తుంటారని, ఈ సారి తనకు టికెట్ దక్కలేదన్న వార్త విని, నన్ను ఓదార్చడానికి వచ్చారని ఆయన తెలిపారు. మా మధ్య పార్టీల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, కేవలం నాకు సీటు దక్కలేదని ఆయన బాధను చెప్పుకోవడానికి మాత్రమే వచ్చారని ఆయన అన్నారు. పార్టీ మార్పుపై స్పందిస్తూ నాకు అలాంటి ఆలోచన లేదని, ఇంకా బిజెపి పార్టీతోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే భవిష్యత్ కార్యచరణ పార్టీ నిర్ణయిస్తుందని, అధిష్టానం ఏం చెబితే అదే చేస్తానని ఆయన స్పష్టం చేశారు.