తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు లేని పేదవారికి శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇళ్ల పట్టాలపై కీలక ప్రకటన చేశారు. రూ. 22,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2024, మార్చి నెలలో ప్రారంభించినట్లు తెలిపారు. అర్హులైన పేదలకు మంజూరు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ఆడబిడ్డల పేరుతోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 చొప్పున రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం 4,50,000 ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశలు రేకెత్తించింది. కానీ అర్హులైన పేదలకు చివరకు నిరాశ నిస్పృహలనే బీఆర్ఎస్ పాలన మిగిల్చింది. అసంపూర్తిగా నిలిచిపోయిన గృహాలలో 34,545 నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం 305.03 కోట్ల నిధులను కేటాయించింది. ఔటర్ రింగు రోడ్డుని ఆనుకొని హైదరాబాద్ సిటీ నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు చేసి, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండ్లను నిర్మించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.