హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు దీటుగా ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో ‘‘ఫ్యూచర్ సిటీ’’పై మంత్రి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ప్రణాళికాబద్ధమైన నగరంగా చండీగఢ్ గుర్తుకొస్తుంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ను కూడా అటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. శంషాబాద్ విమానాశ్రయం, ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) ను కేంద్రంగా చేసుకుని పట్టణీకరణ వేగంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ‘‘ఫ్యూచర్ సిటీ’’ పేరిట ప్రత్యేక నగరాన్ని అన్ని హంగులతో నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈ ఫ్యూచర్ సిటీ పరిధి రంగారెడ్డి జిల్లాకు చెందిన 7 మండలాల్లోని 56 రెవెన్యూ గ్రామాల పరిధిలోని 770 చ.కి.మీల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ఫ్యూచర్ సిటీని అన్ని సదుపాయాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ‘‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’’ని ఏర్పాటు చేశాం. ఈ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచి, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుంది అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.