- హైదరాబాద్లో సియోల్ టెక్నాలజీ
- దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన –
- మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ను సందర్శించిన బృందం
- మూసీ పునరుజ్జీవానికి చంగ్చియాన్ నది స్ఫూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం సోమవారం దక్షిణ కొరియాలో పర్యటించింది. సియోల్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ జీహెచ్ఎంసీ, మూసీ రివర్ఫ్రంట్ అధికారులు ఈ బృందంలో ఉన్నారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్ను ఈ బృందం సందర్శించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్, సియోల్ నగర నమూనాలు ఒకేలా ఉంటాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రజల భావితరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూసీనదిని ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సియోల్లోని చెయోంగ్ గయ్ చియోన్ నదిని ఇతర మంత్రులు, అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
మూసీ పునరుజ్జీవానికి చంగ్చియాన్ నది స్ఫూర్తి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నగరంలో కాలుష్య కాసారంగా మారిన మూసీ నది పునరుజ్జీవానికి చంగ్చియాన్ నది గొప్ప స్ఫూర్తి అని సమాచార, పౌర సంబంధాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగామంత్రి పొంగులేటి సియోల్లో మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన తరువాత ప్రజలకు మూసీ నది అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. పునరుజ్జీవం తరువాత మూసీ కూడా చంగ్చియాన్ నది లాగా అందంగా మారడం ఖాయమని పేర్కొన్నారు.
సియోల్లో 2 వేల సంత్సరానికి ముందుకు, ఆ తరువాత పరిస్థితులపై ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ఇక్కడ పర్యటించి పూర్తి వివరాలు తెలుసుకున్నారని గుర్తు చేశారు. వైశాల్యం, జనాభా పరంగా సియోల్, హైదరాబాద్ ఓకే విస్తీర్ణంలో ఉన్నాయని, అలాంటప్పుడు హైదరాబాద్ సియోల్తో పోటీ పడడంలో తప్పేముందని అన్నారు. సియోల్లో నదుల సుందరీకరణ విషయంలో నిర్వాసితులైన ప్రజలకు ఇక్కడి ప్రభుత్వం ఎలా వారికి ఆదుకుందనే విషయంపై ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నామని మంత్రి పొంగులేటి అన్నారు.